రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు తరలి వస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కోరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామ శివారులో మోనీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు. అంతకు ముందు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ మంత్రి కేటీఆర్ను ఘన స్వాగతం పలికారు. పరిశ్రమ ప్రతినిధులు జార్జెస్ మోనీన్, ఒలివర్ మోనీన్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ఐపాస్తో వేగంగా అనుమతులు మంజూరు చేస్తూ పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తున్నట్లు తెలిపారు. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమతో 350 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. తెలంగాణ రాకముందు మన బతుకులు ఆగమయ్యాయని, నేడు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
– కొండాపూర్, సెప్టెంబర్ 13
కొండాపూర్, సెప్టెంబర్ 13: రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్ ఐపాస్తో వెంటనే అనుమతులను మంజూరు చేస్తూ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేయనున్న మోనీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. అంతకుముందు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ మంత్రి కేటీఆర్ను ఘనంగా స్వాగతం పలికి శాలువాకప్పి సత్కరించారు. పరిశ్రమ ప్రతినిధులు జార్జెస్ మోనీన్, ఒలివర్ మోనీన్లతో కలిసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పరిశ్రమలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, అందులో భాగంగానే విదేశీ పరిశ్రమ యాజమాన్యాలు పెట్టుబడులతో రాష్ర్టానికి క్యూకడుతున్నారని గుర్తు చేశారు. మోనిన్ జ్యూస్ పరిశ్రమ ప్రతినిధులు 40 ఎకరాల విస్తీర్ణంలో రూ. 300 కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానికంగా ప్రత్యక్షంగా 150, పరోక్షంగా 250 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
మోనీన్ సిరప్, జ్యూస్ పరిశ్రమ ప్రపంచంలోని ఏడు దేశాల్లో ఉన్నదని, 8వ ప్లాంట్ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పటివరకు ఫ్రాన్స్-2, యూఎస్ఏ-2, రష్యా-1, మలేషియా-1, చైనా -1లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరొక పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని చేస్తున్న అభివృద్ధిని చూసి పెట్టుబడులతో రాష్ర్టానికి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీఎస్ఐపాస్ విధానంతో పరిశ్రమల స్థాపనకు సులభమైన పద్ధతిలో అనుమతులు ఇవ్వడంతోపాటు మౌలిక వసతులు కల్పించడంతో ఆకర్షితులై రాష్ర్టానికి పెట్టుబడిదారులు వస్తున్నారన్నారు. అలాగే పరిశ్రమలు రావడం స్థాపించుకోవడమే కాక స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ పరిశ్రమ జీరో పర్సెంట్ కాలుష్యానికి అతీతంగా ఉత్పత్తులు ప్రారంభిస్తుందని మంత్రి వివరించారు.
మోనీన్ జ్యూస్ పరిశ్రమల 18 నెలల్లో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని పరిశ్రమ ప్రతినిధులు తెలపడం గర్వించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. స్థానికంగా పరిశ్రమ నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే సహకారం అందించేందుకు చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్తో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అందుబాటులో ఉండి పరిశ్రమ ప్రతినిధులకు సహకరిస్తారని మంత్రి కేటీఆర్ సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపేందుకు ఐదు రకాలైన హరిత విప్లవం, నీలి విప్ల వం, పింక్ విప్లవం, శ్వేత విప్లవం, ఎల్లో విప్లవాలను తీసుకొచ్చి రాష్ట్రంలోని అర్హులైన వారికి ఉపాధి కల్పించి ఆదుకోవడంతో ఉత్పత్తులు బాగా పెరిగాయని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో గతంలో 68లక్షల టన్నుల వరి ధాన్యం పండించిన అన్నదాతలు నేడు 3.50 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్నారని గుర్తు చేశారు. హరిత విప్లవంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, చెరువు, పొలం గట్లతోపాటు ప్రతి ఇంటి ఎదుట పండ్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తితో దేశానికే ఎగుమతి చేసే స్థాయిలో చేపల ఉత్పత్తి నిలవడం, మత్స్యకారులకు చేతినిండా పని కల్పించిన ప్రభుత్వం తెలంగాణే అని గుర్తు చేశారు. రాష్ట్రంలో 46వేల చెరువులలో 30కోట్లకు పైగా చేప పిల్లలు వదిలి నీలి విప్లవాన్ని సృష్టించి ఇతర రాష్ర్టాలకు చేపలను ఎగుమతి చేస్తున్నారన్నారు. పింక్ విప్లవం ద్వారా మాంసం ఎగుమతి చేసి గులాబీ విప్లవం తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. శ్వేత విప్లవంతో పాల ఉత్పత్తిని పెంచేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలతో నష్టాల్లో ఉన్న విజయడెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చారన్నారు. దీంతో అన్నదాతలకు ఉపాధి కల్పించే విధంగా గేదెలను సబ్సిడీపై అందజేసి పాల ఉత్పత్తిని పెంచామన్నారు. అలాగే ఎల్లో విప్లవంలో పారిశ్రామికంగా అభివృద్ధి సాధించడంతోపాటు ఆయిల్పామ్ను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో పంట పండించేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో తీసుకొస్తున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో గుంతపల్లి సర్పంచ్ సుమిత్ర, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోట్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, ఎమ్మెల్సీ సత్యనారాయణ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జాయేష్ రంజన్, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీవో రవీందర్రెడ్డి, సంస్థ ప్రతినిధులు థియరీ బెర్థెలాట్, జార్జెస్ మోనీస్, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, జడ్పీటీసీ పద్మావతీపాండురంగం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రుక్మోద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మ్యాకం విఠల్, నాయకులు గోవర్ధన్రెడ్డి, రఘునాథ్రెడ్డి, అనంత్రెడ్డి, కుమార్, గురుకిరణ్ పాల్గొన్నారు.