జహీరాబాద్ డివిజన్లో 69,429.59 హెక్టార్లలో
వివిధ పంటల సాగుకు అవకాశం
వానకాలం సీజన్లో పత్తి విస్తీర్ణం
25 నుంచి 30 శాతం పెరుగుతుందని అంచనా
విత్తనాలు, ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖ కార్యాచరణ
తొలకరి వర్షాలు పడగానే పనులు ప్రారంభించేందుకు
సిద్ధమవుతున్న అన్నదాతలు
రసాయనాలకు ఎరువులకు స్వస్తి.. సేంద్రియం ఆసక్తి
మట్టి పరీక్షలు చేయించుకోవాలని అధికారుల సూచన
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుంచి 30శాతం పెరగొచ్చని వ్యవసాయశాఖాధికారులు భావిస్తున్నారు. మొత్తం 69,429.59 హెక్టార్లలో వివిధ పంటలు పండించే అవకాశం ఉండగా, ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పత్తితో పాటు సోయా, మినుము, కంది, పెసర సాగు ఏర్పాట్లపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నది. నకిలీ విత్తనాలు,ఎరువుల విక్రయాలు, కృత్రిమ కొరత, అధిక ధరలకు అమ్మడం వంటివాటిని నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
జహీరాబాద్, మే 15 : వర్షాకాలంలో పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వాణిజ్య పంటలైన పత్తిని అధికంగా సాగు చేసేందుకు భూములను సిద్ధం చేస్తున్నారు. సోయా, మినుము, కంది, పెసరా, అత్యధికంగా సాగు చేసేందుకు ఏర్పాట్లపై కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైంది. మే ప్రారంభం నుంచి పత్తి విత్తనాలు అమ్మకాలు చేసేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ముందుగానే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సారి గతేడాది కంటే రెండు వారాల ముందుగానే పత్తి విత్తనాల మార్కెటింగ్ మొదలు కానున్నది. ముందుస్తుగా నాటిన పత్తి.. గతేడాది ఆశాజనకంగా ఉండటం, గులాబీ రంగు పురుగును తట్టుకుంటుందన్న అంచనాలతో ఈ సారి ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. పత్తి క్వింటాల్కు రూ. 10 వేలు పలకడం కలిసి వస్తుందని అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. తొలకరి వానలు పడగానే దుక్కులు సిద్ధం చేసుకొని విత్తనాలు నాటడానికి సన్నద్ధమయ్యారు. దీంతో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం 25 నుంచి 30 శాతం పెరగవచ్చునని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
రైతులకు సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలు
ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నది. జనుము, జీలుగ పంట సాగు చేసి భూమిలో దున్నడంతో సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కంటే ముందుగా వ్యవసాయ శాఖ రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నది.
ఎరువులు , విత్తనాలు అందుబాటులో..
వర్షాకాలంలో పంటలు సాగు చేసే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. జహీరాబాద్లో ప్రైవేటు వ్యాపారులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకాలు చేసేందుకు ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. అత్యధికంగా పత్తి, పెసరా, మినుము, కంది, సోయా, జొన్న, మక్క పంటలు సాగు పై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వేసవిలో భూములు ట్రాక్టర్లుతో దున్ని పంటలు సాగు చేసేందుకు సిద్ధమ వుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు బ్లాక్లో విత్తనాలు, ఎరువులు అమ్మకాలు చేస్తే కేసు నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నాం..
వర్షాకాలం సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం వానకాలం సీజన్కు సంబంధించిన పంటల సాగు వివరాలు సేకరించి అవసరమైన విత్తనాలు, ఎరువులు నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. నకిలీ విత్తనాలు అమ్మకాలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. రైతులు పంటలు సాగు చేసేందుకు వారి భూముల నుంచి మట్టి సేకరించి మట్టి పరీక్షలు చేసి పంటలు సాగు చేసుకోవాలి. వానకాలంలో పత్తి పంట సాగు పెరిగే అవకాశమున్నది. పత్తి విత్తనాల కొరత రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
-భిక్షపతి, ఏడీఏ జహీరాబాద్
వానకాలం సీజన్లో 69,429.59 హెక్టార్లలో సాగు
జహీరాబాద్ వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాల్లో వానకాలం సీజన్లో రైతులు 69,429.59 హెక్టార్లలో పంటలు సాగు చేసే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నా రు. జహీరాబాద్ ప్రాంతంలో సాగు విస్తీర్ణం 69,429.59 హెక్టార్లు ఉంది. గతంలో రైతులు పంటలు సాగు చేసేందుకు బ్యాంక్లు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పలు తీసుకోనేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి కోసం రైతు బంధు పథకంలో ఎకరాకు రూ.10 వేలు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు ఎవరూ బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకోనేందుకు ఆసక్తి చూపడం లేదు. జూన్ మొదటి వారంలో రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు ప్రతి ఏడాది చెల్లిస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల బ్యాంక్ల ఖాతాలు, భూముల వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.