గజ్వేల్, డిసెంబర్ 26: ఆరుతడి పంటలతో అధిక లాభాలు సాధించేందుకు రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల పంటలు సాగు చేస్తూ దిగుబడి సాధిస్తున్నారు. తక్కువ నీటితో పండించే కూరగాయలను సాగు చేస్తున్నారు. స్వీట్కార్న్ మొక్కజొన్న, ఉల్లిగడ్డ, పూలతోటల పెంపకంపై కూడా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో రైతులు పండించిన కూరగాయలు, స్వీట్కార్న్ మొక్కజొన్నను హైదరాబాద్లోని వివిధ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్ పట్టణానికి సరిపడా కూరగాయలను ఎగుమతి చేయడంలో గజ్వేల్ ప్రాంత రైతులే ఎక్కువ.
గజ్వేల్ సమీకృత కూరగాయల మార్కెట్లో రైతులు ప్రతిరోజూ ఉదయం తాజా ఆకుకూరలు, కూరగాయలను విక్రయాలు చేపడుతున్నారు. గజ్వేల్ మండలం గిరిపల్లి, కొమటిబండ, బంగ్లావెంకటాపూర్, ధర్మారెడ్డిపల్లి, అహ్మదీపూర్, శేర్పల్లి, దిలాల్పూర్, వర్గల్ మండలం పాతూర్, పాములపర్తి, గౌరారం, చౌదర్పల్లి, మర్కూక్ మండలం ఎర్రవల్లి, గణేశ్పల్లి, ములుగు మండలంలోని క్షీరసాగర్, అన్నసాగర్, వంటిమామిడి, చిన్నతిమ్మాపూర్, నర్సంపల్లి, ములుగు, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో రైతుల పొలాలు పచ్చని కూరగాయల పంటలతో కనిపిస్తున్నాయి. రైతులు పండించిన కూరగాయల పంటలను విక్రయించుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం మార్కెట్లను ఏర్పాటు చేసింది. గజ్వేల్లో సమీకృత మార్కెట్, ప్రజ్ఞాఫూర్ సమీపంలోని పాతూర్ వద్ద రాజీవ్ రాహదారిపై కూరగాయల మార్కెట్లో రోజూ వందలాది మంది రైతులు వారు పండించిన కూరగాయలను అమ్ముకొని లాభాలు అర్జిస్తున్నారు. వంటిమామిడి మార్కెట్కు నిత్యం క్వింటాళ్ల కొద్దీ కూరగాయలను రైతులు తీసుకొచ్చి ప్రైవేటు సంస్థలకు విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు తాజా కూరగాయలను తరలిస్తున్నారు. ఆరుతడి పద్ధతుల్లో రైతులు కూరగాయలను సాగు చేయడంతో అధిక లాభాలు పొందుతున్నారు. ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులను వ్యవసాయాధికారులు ప్రోత్సాహిస్తున్నారు.