Agriculture | నిజాంపేట, జూలై 23: నిజాంపేట మండల వ్యాప్తంగా రైతులు అధికంగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. గత యాసంగిలో నిజాంపేట మండల వ్యాప్తంగా 13,344 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ సారి ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వరిలో అధిక దిగుబడి సాధించాలనే లక్ష్యంతో కొంత మంది రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేస్తున్న పంటలకు మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందులను ఉపయోగిస్తున్నారు. దీంతో ఎరువుల కొనుగోలుకు ఖర్చుతో పాటు రానురాను భూసారం దెబ్బతిని, పంట దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రసాయన ఎరువులు క్రమంగా తగ్గిస్తూ, పంటలకు సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచిస్తున్నారు. అధికంగా రసాయన ఎరువులను వాడటం వల్ల పంటలకు వివిధ రకాల వ్యాధులు ప్రబలుతాయి.
ఆకు మాడటం: కొన్ని రకాల పురుగు మందులు పంటలపై స్ప్రే చేసినప్పుడు ఆకుల అంచులు, మధ్యలో మాడిపోతాయి. ఒక్కోసారి మొక్క పెరగుదల ఆగిపోతుంది. మొక్కల కణజాలం చనిపోవడం: మొక్కల్లో వివిధ భాగాల్లో అధికంగా చల్లిన ఎరువులతో కణజాలం పూర్తిగా చనిపోయి, తెగులు సోకినప్పుడు వచ్చే మచ్చలవలే ఎరుపు రంగు మచ్చలు ఏర్పాడుతాయి.
ఆకులు పసుపు, వంకర్లు తిరగడం: పంటలపై అధికంగా చల్లిన ఎరువులు, పురుగు మందులతో ఆకులు మొదటగా పసుపు వర్ణంలోకి మారి, ఆ తర్వాత ఉబ్బెత్తు నిర్మాణాలు ఏర్పడి ముడుచుకుపోతాయి.
మొక్కలు గిడుసుబారడం: మొక్కల్లో పూర్తిగా ఎదుగుదల మందగిస్తుంది. మోతాదుకు మించి గారి మిశ్రమ మందులను పిచికారీ చేసినప్పుడు ఇటువంటి లక్షణాలు బహిర్గతమై ఆకులలో స్పష్టంగా కన్పిస్తాయి.
పంటలను సాగు చేస్తున్న రైతులు సేంద్రియ ఎరువులను వినియోగించడం వల్ల భూసారం పెరగడం, అధిక దిగుబడి సాధించవచ్చు. కొంత మంది రైతులు విరివిగా తమ పంటలకు రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో మొదట పంట దిగుబడి అధికంగా వచ్చినా ఆ తర్వాత క్రమేపి దిగుబడి తగ్గిపోయి బీడుగా మారిపోతాయి. మోతాదుల్లో మాత్రమే ఎరువులను పంటలకు వినియోగిస్తూ అధిక దిగుబడులు పొందవచ్చు. అధిక ఉష్ణోగ్రత, నీటి ఎద్దడి సమయాల్లో పంటలకు ఎరువులు, పురుగు మందులు చల్లకూడదు. అదేవిధంగా రెండు, మూడు రకాల పురుగు మందులను మిశ్రమంగా చేసి పిచికారీ చేయకూడదు. పంటలకు వ్యాధులు సంక్రమించినప్పుడు ఇష్టానుసారంగా కాకుండా ముందుగా వ్యవసాయ అధికారులను సంప్రదించి వారు సూచించిన వాడాలి.
– సతీశ్, నిజాంపేట మండల ఏవో