వానకాలం ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో రైతులు యాసంగి సేద్యానికి రెడీ అవుతున్నారు. దుక్కులు దున్నడం, వడ్లు చల్లడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎరువుల దుకాణాల వద్ద సందడి నెలకొన్నది. వర్షాలు సమృద్ధిగా కురవడం, చెరువులు, బోరుబావుల్లో నీళ్లు ఉండడంతో రైతులు యాసంగి సాగుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వ్యవసాయ శాఖ యంత్రాంగం కూడా సీజన్ అవసరాలకు తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,69,204 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయన్నది అంచనా కాగా, సిద్దిపేట జిల్లాలో 62,196, సంగారెడ్డి జిల్లాలో 45,207 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. మెదక్ జిల్లాలో 52,014 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ యాసంగిలో అత్యధికంగా 7,46,000 ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు వ్యవసాయాధికారులు ప్రణాళిక రూపొందించారు.
హుస్నాబాద్, డిసెంబర్ 11: యాసంగి సీజన్ మొదలవడంతో రైతన్నలు సాగు పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. వానకాలం పంట కోసిన వెంటనే యాసంగి పనులు మొదలుపెట్టారు. యాసంగిలో ఎంత ముందుగా పంట వేస్తే అంత ముందుగా చేతికొస్తుంది. యాసంగి పంట దిగుబడులు వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే పంటలు వేసి ముందుగా చేతికందేలా రైతులు యాసంగి సాగు పనులు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల్లో యాసంగి పనులు షురువయ్యాయి. ఇందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎరువుల దుకాణాల వద్ద సందడి నెలకొంది. గతేడాదిలాగానే ఈయేడూ వర్షాలు సమృద్ధిగా కురవడం, చెరువులు, బావులు, బోర్లల్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులు యాసంగి సాగుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వేసవిలో పంట చేతికందే సమయంలో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే రైతులు సాగు పనులు ముమ్మరం చేస్తున్నారు. పలుచోట్ల మొలక అలికి, నార్లు పోసి, పొలం దున్నకం పనుల్లో బిజీబిజీ అయ్యారు.
సిద్దిపేట జిల్లాలో ఈ యాసంగిలో 3 లక్షల 85 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నదని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధాన పంట వరి 3 లక్షల 60 వేల ఎకరాలు, మొక్కజొన్న 15,800 ఎకరాలు, వేరు శనగ 1000 ఎకరాలు, శనగ 2000 ఎకరాలు, పొద్దు తిరుగుడు 7000 ఎకరాల్లో సాగు కానున్నట్లు తెలిపారు. ప్రస్తుత నీటి వనరులు, వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. పంటల సాగుకు సరిపోయేలా జిల్లాకు 62,106 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు.
గజ్వేల్ పట్టణంలో రైల్వే రేక్పాయింట్ ఏర్పాటుతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎరువుల కొరత తీరినట్లయ్యింది. అంతకుముందు ఎరువుల సరఫరా కేవలం వాహనాల ద్వారా జరిగేది. దీంతో ముందస్తుగా ఎరువులను సిద్ధం చేసేందుకు అవకాశం ఉండేది కాదు. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు కృషితో గజ్వేల్ రేక్పాయింట్ ఏర్పాటు కావడంతో ఎరువుల కొరత లేదు. ఈ రేక్ పాయింట్తో సిద్దిపేట జిల్లాకే కాకుండా సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలకు కూడా ఎరువులు సరఫరా అవుతున్నాయి.
యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. విత్తనాల ఎంపికలో రైతులు మెళకువలు పాటించాలి. ఎవరో చెప్పారని నాసిరకం విత్తనాలతో సాగు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. యాసంగిలో ఏ విత్తనం వాతావరణాన్ని తట్టుకుంటుందో వాటినే వినియోగించాలి. ప్రభుత్వం గుర్తించిన సీడ్ కంపెనీల విత్తనాలు ఎంచుకుంటే మంచిది. ఎరువుల వాడకంలోనూ రైతులు అధికారుల సూచనలు తీసుకోవాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుకు తగిన పంటల యాజమాన్యాన్ని ఎప్పటికప్పుడు పాటిస్తే పంట దెబ్బతినకుండా ఉంటుంది. ఈ సీజన్లో గతేడాదికంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది.