కోహీర్, సెప్టెంబర్ 22: స్థానికంగా కోల్డ్ స్టోరేజీలు లేక ఆలుగడ్డ రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాల కోసం ఆగ్రా, పంజాబ్లోని జలంధర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. వ్యాపారుల నుంచి 50 కిలోల బస్తాను రూ.1600కు కొనుగోలు చేసి రైతులు ఆలు సాగుచేస్తున్నారు.
వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆలుగడ్డ పంట సాగుపై అన్నదాతలు ఆసక్తి చూపిస్తున్నారు. బోరుబావుల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో ఆలుగడ్డ సాగుపై రైతన్నలు ప్రత్యేక దృష్టిసారించారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా కోహీర్ మం డలంలో 2 వేల ఎకరాలకు పైగా సాగవుతున్నది. గతేడాది 938 మంది రైతులు 2,300 ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగుచేశారు. ప్రస్తుతం వానలు సమృద్ధిగా కురవడంతో సాగు విస్తీర్ణం 3వేల ఎకరాలకు పెరిగే అవకాశం ఉంది.
ఆలుగడ్డ విత్తనం నాటిన తర్వాత 80 రోజుల నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. తొందరగా లాభాలను పొందాలనే ఉద్దేశంతో రైతులు ఆలు సాగుపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. మరీ ఇంత తక్కువ కాల పరిమితిలో ఇతర పంటలు ఏవీ కూడా చేతికి రావు. దీంతో బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉన్న రైతులు ఆలు సాగుపై శ్రద్ధ కనబరుస్తున్నారు. ఖాళీ భూమి ఉన్న రైతులతో పాటు సోయాబీన్ పంట ధాన్యం తీసుకొని అందులో కూడా ఆలుగడ్డ విత్తనం నాటుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో అధికంగా కోహీర్ మండలంలో ఆలుగడ్డ సాగవుతుండగా, ఏటా సెప్టెంబర్ చివరి నాటికి విత్తనాలను నాటడం ప్రారంభిస్తారు. అత్యధికంగా కోహీర్, కవేలి, గొటిగార్పల్లి, దిగ్వాల్, పీచెర్యాగడి, మాచిరెడ్డిపల్లి, సజ్జాపూర్, బిలాల్పూర్, మనియార్పల్లి గ్రామాల్లో పంట పండిస్తున్నారు. ఆలుగడ్డ విత్తనాలు మాత్రం స్థానికంగా లభించవు. దీంతో విత్తనాల కోసం చాలామంది రైతులు 2 వేల కిలోమీటర్ల దూరంలోని ఆగ్రా, పంజాబ్లోని జలంధర్, తదితర దూర ప్రాంతాల నుంచి లారీ ల్లో విత్తనాలను తీసుకొస్తున్నారు. కొంతమంది రైతులు వారం పాటు అక్కడే ఉండి సరైన విత్తనాల సేకరణ కోసం వేచి చూస్తున్నారు. దీంతో సమయం వృథా తోపాటు అన్నదాతలపై ఆర్థికభారం పడుతున్నది.
కోహీర్ మండలంలో చాలామంది రైతులు ఆలుగడ్డను పండిస్తున్నారు. నేను ఏటా 50క్వింటాళ్ల కంటే ఎక్కువగానే విత్తనాలను కొంటాను. నేను ఇంతకు ముందు విత్తనాల కోసం ఆగ్రా, జలంధర్ వెళ్లాను. అక్కడ అన్నీ కష్టాలే. రైతుల ఇబ్బందులు తీరాలంటే కోహీర్ మండలంలో కోల్డ్స్టోరేజీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
-రాచూరి కనకరత్నం, రైతు, కోహీర్, సంగారెడ్డి జిల్లా
కోహీర్ మండలం నుంచి చాలామంది రైతులు ఏటా ఆగ్రా, జలంధర్, తదితర దూర ప్రాంతాలకు వెళ్లి ఆలుగడ్డ విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడే కోల్డ్స్టోరేజీ ఉంటే అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. రైతుల అవసరార్ధం కోల్డ్స్టోరేజీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. స్థానికంగా కోల్డ్ స్టోరేజీ ఏర్పాటయ్యేలా చూస్తాం.
-నవీన్కుమార్, కోహీర్ మండల వ్యవసాయాధికారి, సంగారెడ్డి జిల్లా