పెద్దశంకరంపేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు.
బుధవారం పీఎసీఎస్ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట, జంబికుంట గ్రామాల్లో, ఐకెపీ ఆధ్వర్యంలో మండలపరిధిలోని కమలాపురం, బుజ్రాన్పల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు వరికి బదులుగా వ్యవసాయాధికారులు సూచించిన మేరకు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మార్కెటింగ్ సమస్య రావొద్దనే ఉద్దేశంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పీఎసీఎస్ చైర్మన్ సిద్ద సంజీవరెడ్డి, ఐకెపీ ఏపీఎం గోపాల్, సర్పంచ్ సత్యనారాయణ, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేష్గౌడ్, మాణిక్రెడ్డి, సీఈవో రవీందర్, తదితరులున్నారు.