బీజేపీ నాయకుల అబద్ధాలపై ప్రజానీకం మండిపడుతున్నది.. తుక్కుగూడ వేదికగా చేసిన చిల్లర మాటలను ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఇక్కడ రైతు రాజ్యం నడుస్తున్నదని రైతులోకం నినదిస్తున్నది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణ లాంటి పథకాలు ఎక్కడా? అని ప్రశ్నిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా? అని అడుగుతున్నది. బీజేపీ నాయకుల అకౌంట్లలో రైతుబంధు డబ్బులు జమ అవుతున్న విషయం తెలియదా? ఇది వాస్తవం కాదా? తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను చూడాలని హితవు పలుకుతున్నది. నోటికి ఏదివస్తే అది మాట్లాడడం సరి కాదని సూచిస్తున్నది. మసిపూసి మారేడుకాయ చేసి, ఏదో గోల్మాల్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చూడడం సరికాదని పేర్కొంటున్నది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తుక్కుగూడ సభలో ఏదో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను అన్నివర్గాల ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఒక కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలేనా..? ఇలానే మాట్లాడుతారా..? అంటూ కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులపై రైతులు పెదవి విరుస్తున్నారు.
సిద్దిపేట, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తున్నది.. రైతుబంధుతో పెట్టుబడికి రంది లేకుండా పోయింది.. రైతుబీమాతో భరోసా ఏర్పడింది.. వ్యవసాయానికి రాష్ట్ర సర్కారు 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నది.. రైతుల కోసం ప్రాజెక్టులు నిర్మించింది.. ఆ బీజేపీ ఏం చేసింది.. అబద్ధాలు చెబుతున్నది.. బీజేపీ పెద్ద మనిషి అంట.. ఆయన తుక్కుగూడలో ఏదేదో మాట్లాడి,పచ్చి అబద్ధాలు మాట్లాడి పోయిండంట.. ఇక్కడ ఏం జరిగిందో ఆయన కండ్లకు కనిపించడం లేదా?.. బీజేపీ నాయకుల అకౌంట్లలోనూ రైతుబంధు డబ్బులు పడుతున్న విషయం తెలియదా?’.. అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో వాస్తవ పరిస్థితులు చూడాలని ప్రజల హితవు పలుకుతున్నారు.
రైతుబీమాతో ధీమా..
రైతు ఏదైనా కారణంతో మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలను రైతుబీమా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. రైతులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా అర్హులైన ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేస్తున్నది. ఇప్పటి వరకు రూ.50 వేల వరకు మాఫీ చేయగా, తాజాగా ప్రస్తుత బడ్జెట్లో రూ. 75 వేలకు మాఫీ చేస్తామని బడ్జెట్ నిధులు కేటాయించింది. ఇలా రైతు సంక్షేమానికి పని చేస్తున్నది. కానీ, బీజేపీ నాయకుల మాటలు విడ్డూరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు బీజేపీ నాయకులు లబ్ధి పొందుతున్నారు. కానీ, మళ్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు అని మాట్లాడుతున్నారు. మీ పాలిత రాష్ర్టాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నారా? పోని.. మీరు పాలించే రాష్ర్టాల్లో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? కోతలు లేని కరెంట్ ఇస్తున్నారా? వీటికి సమాధానం మీ వద్ద ఉందా? అని బీజేపీ నాయకులను జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరేండ్లుగా రైతులకు నాణ్యమైన 24గంటల కరెంట్ ఇస్తున్నది. దేశంలో 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కోతలతో పరిశ్రమలు మూతపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి గుంటకూ సాగునీరు అందుతున్నది. గోదావరి జలాలతో చెరువులు, చెక్డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. ఇది నిజం కాదా? అని సూటిగా బీజేపీ నాయకులను ఈ ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు.
నేరుగా రైతు ఖాతాలోకి..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు నేరుగా రైతుల ఖాతాలోనే రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తున్నది. రైతుబంధు పథకం ప్రారంభం నుంచి వరుసగా ఎనిమిదో పంటకు సీఎం కేసీఆర్ అందించారు. రైతుబంధు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనిమిది పంటలకు 59,84,281 మంది రైతులకు (ఎనిమిది క్రాప్లు కలిపి రైతుల సంఖ్య) గాను రూ. 6,154.25 కోట్లు నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. సిద్దిపేట జిల్లాలో 20,08,784 మంది రైతులకు గాను రూ. 2168.41 కోట్లు, మెదక్ జిల్లాలో 17,26,509 రైతులకు గాను రూ.1450.02కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 21,76,988 లక్షల మంది రైతులకు గాను రూ.2535.82 కోట్లను ఎనిమిది విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం వేసింది.
రైతులకు మేలుచేస్తే బీజేపీకి గిట్టడం లేదు..
రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ రైతులకు మేలుచేస్తుంటే, ఇది గిట్టని కేంద్రమంత్రి అమిత్ షా రైతులకు ఏం చేయలేదు అని మాట్లాడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం స్ఫూర్తితోనే కదా మీరు కేంద్రంలో ‘పీఎం కిసాన్’ను ప్రవేశపెట్టింది. తుక్కుగూడ సభలో మీకు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అమిత్ షా .. తెలంగాణ ప్రాంత రైతులకు క్షమాపణ చెప్పాలని అన్నివర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్టీలకతీతంగా పట్టాదారు పుస్తకం ఉన్న ప్రతి రైతు వ్యక్తిగత ఖాతాలో ఎకరాకు రూ. 5 వేల చొప్పున, రెండు పంటలకు ఏటా రూ. 10 వేలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నది. రైతుబంధు పథకంలో మీ బీజేపీ నాయకుల వ్యక్తిగత ఖాతాల్లో కూడా డబ్బులు పడుతున్నాయి. ఏడాదికి రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.10 వేలు మీ బీజేపీ నాయకులు తీసుకుంటలేరా? ఇది వాస్తవం కాదా? దీనికి బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారు?అని జిల్లా రైతులు ప్రశ్నిస్తున్నారు.
పచ్చి అబద్ధాల బీజేపీ..
బీజేపీ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు తప్పా ఆ నోటికి మరోటి రాదు. నిత్యం అబద్ధాల పునాదుల మీదనే వారు రాజకీయం చేస్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి, ఏదో గోల్మాల్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడమే వారి లక్ష్యం. ప్రజల బాగోగులు వారికి అసలు పట్టవు.. పెట్రో, డీజిల్, వంటగ్యాస్ తదితర ధరలు పెంచి ప్రజలపై విపరీతమైన భారం మోపింది. ప్రజల ముందు డ్రామాలు తప్పా మరోటి లేదు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, జరిగిన అభివృద్ధి బీజేపీ నాయకులకు కనపడడం లేదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తుక్కుగూడ సభలో ఏదో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను అన్నివర్గాల ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఒక కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలేనా..? ఇలానే మాట్లాడుతారా..? అం టూ కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులపై రైతులు పెదవి విరుస్తున్నారు.
సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శం
ప్రతి వానకాలం, యాసంగి పంటలకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందుస్తున్నడు. కేంద్రం వడ్లు కొనకపోయినా తెలంగాణ ప్రభుత్వం కొంటున్నది. బీజేపీ రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నది. రైతులకు మంచి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపోళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సీఎం దేశంలోనే ఆదర్శంగా నిలిచిండు. ఆయన ముందు చూపుతోనే మంచి పని చేసిండు. రైతుబంధు, ఎరువులు విత్తనాల కోసం అనేక పథకాలు తీసుకురావడం మా అదృష్టం. మా లాంటోళ్లకు అవసరమైన అనేక పథకాలు ప్రవేశపెట్టిండు. మొన్న ఎవరో పువ్వు గుర్తు పెద్దాయన వచ్చిండని టీవీలో చూసినం. గాయన ఎవరో మాకు కాదు, మా ఊళ్లో కూడా ఎవరికి తెలువదు.. ఆయనకు మన భాష కూడా రానట్టుంది. ఎక్కడి నుంచో వచ్చినోళ్లతో మాకు పని లేదు. మాకు కేసీఆర్తోనే లెక్క. కేసీఆర్ సార్ చెప్పినట్లే వింటాం. సార్తోనే ఉంటాం. – నర్సింహులు, రైతు, పేరూరు, మెదక్
రైతుల కండ్లల్లో ఆనందం నింపుతున్నడు..
రైతుబంధుతో ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి సీఎం కేసీఆర్ సార్ లాగోడి ఖర్చుకు ఆదుకుంటున్నడు. బీజేపోళ్లకు దమ్మూ ధైర్యం ఉంటే జనాల్లోకి వచ్చి ఏం చేసిండ్రో చెప్పాలి. గొప్పలు చెప్పుకోవడం కాదు, రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే చేతల్లో చూపించాలి. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రైతులు యాసంగి పంటలు వేయాలో లేదో తెలియక ఇబ్బందులు పడ్డారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను బీజేపీ విమర్శించడం విడ్డూరంగా ఉంది. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష.
– ఆకుల రాములు, నందిగామ, రామాయంపేట
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుందని సీఎం కేసీఆర్ సార్కు తెలుసు. అందుకే అన్ని తీర్ల ఆదుకుంటున్నడు. మాకు సమయానికి రైతుబంధు డబ్బులు వస్తున్న యి. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయినంక మా బతుకులు మార్చాడు. పెట్టుబడి సాయంతో పాటు 24గంటలు కరెంట్ ఉచితంగా ఇస్తున్నడు. కేంద్రం ఎరువుల ధరలు పెంచి ఇబ్బంది పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎరువులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు తెచ్చి పంటల సాగుకు ఇస్తున్నది.
– రజినీకాంత్, రైతు. మగ్ధుంపూర్, మెదక్
టీఆర్ఎస్పై బురదజల్లే ప్రకటనలు విడ్డూరం
రైతులు ఎల్లప్పుడు చల్లంగుండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఆ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ రైతులను ఆదుకుంటున్నది. రైతుబీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటులాంటి పథకాలతో మేలు చేస్తున్నది. ఓర్వలేని బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై బురదజల్లడం విడ్డూరం. రైతులు పడే కష్టం స్వయంగా తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. వారి బాధలు చూసి ఎకరాకు రూ.5వేల చొప్పున సాయం చేస్తున్నడు. గోదావరి నీళ్లతో పంట పొలాలు తడిపిండు. – బాలరాజ్, బూర్గుపల్లి, హవేళీఘనపూర్
బీజేపీని తరమికొడుతాం..
పెట్రో, డీజిల్ ధరలు పెంచి సామాన్యునితో పాటు రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి. రైతుల ఉసురు తప్పకుండా తగులుతుంది. రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్పై అడ్డదిడ్డంగా మాట్లాడే బీజేపీ నాయకుల్లారా ఖబర్దార్. బీజేపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రైతుల పక్షపాతిగా ఉంటూ రైతుల ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు ఎల్లవేళలా అండగా ఉంటాం.
– పిల్లి తిరుపతి, రైతు, జక్కాపూర్
రైతులకు సౌలత్ చేస్తున్న కేసీఆర్
తెలంగాణ ఏర్పాటైనంక రైతులకు చాలా మేలు జరుగుతున్నది. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి రైతులకు సౌలత్ జరిగింది. బీజేపీ పెద్దసార్లు పట్నం వచ్చి పదిరకాలుగా మాట్లాడుతున్నరు. రైతుబంధు ఇవ్వడంతో సంతోషంగా పంటలు పండిస్తున్నాం. బీజేపీతో తెలంగాణకు ఏం వచ్చిందో వారికే తెలువాలె. పనిచేసేటోళ్లను తిడితే ఓట్లు రావనే విషయాన్ని ఢిల్లీల ఉండే బీజేపీ పెద్దసార్లు గుర్తుంచుకోవాలి.
– కడ్డూరి రాములు, రైతు, ఆకునూరు, చేర్యాల
ఎవుసానికి రైతుబంధే ఆధారం
సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబంధు పథకం డబ్బులతోనే కారుకారుకు మాకు పంట పెట్టుబడులు ఎల్లుతున్నాయి. గింత మంచిగా రైతులకు రైతుబంధు డబ్బులు ఇయ్యడం మాకు చాలా సంతోషంగా ఉంది. గా బీజేపీ నాయకులు ఎన్నడు? ఎక్కడా కూడా రైతులకు పెట్టుబడులు ఇయ్యలేదు. రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ సార్ మంచిగుండాలని భగవంతుడిని కోరుతున్నా.
– రంగనమైన లక్ష్మి, మహిళా రైతు, మిరుదొడ్డి
బీజేపీ వాళ్లు ఎక్కడా రైతుబంధు ఇస్తలేరు
దేశంలో ఎన్నో రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పభుత్వాలు నయా పైసా కూడ ఎవుసం చేయడానికి రైతులకు ఇవ్వడం లేదు. దేశంలోనే తెలంగాణ రైతులకు పంటల పెట్టుబడులకు పైసలిస్తున్నది సీఎం కేసీఆర్ సార్ ఒక్కడే. బీజేపీ నాయకులు రైతులకు ఏదో చేసినట్లు చెప్పడం సరికాదు. సీఎం కేసీఆర్ సార్కు రైతులందరం రుణపడి ఉంటారు.
– నర్మాల ఆంజనేయులు, రైతు, మిరుదొడ్డి
పువ్వు గుర్తొల్లు లేని లొల్లి పుట్టింతరు
కేసీఆర్ సార్ సీఎం అయిన తర్వాత అందరినీ సమానంగా చూస్తున్నడు. ఊర్లో హిందువులు, ముస్లిములు అని తేడా లేకుండా మేము అంతా కలిసి మెలిసి ఉంటున్నాం. గట్ల్లనే సీఎం సార్ కూడా అందరికీ పథకాలు అందిస్తున్నడు. గట్లాంటి సార్పైన గీ పువ్వు గుర్తొల్లు లేని అబద్ధాలు చెబుతున్నరు. కలిసి ఉన్నోళ్లను విడగొట్టి ఓట్లు వేసుకోవాలన్న ఆలోచనతో పువ్వు గుర్తొల్లు లేని లొల్లి పుట్టిస్తున్నరు. పువ్వు గుర్తొల్లు చెప్పే అబద్దాలు ఎవరు నమ్మే స్థితిలో లేరు.
– ఎండీ. హసన్బీ, రసూలాబాద్, కొమురవెల్లి
బీజేపోళ్లవి దొంగ నాటకాలు..
కేంద్ర ప్రభుత్వ వైఖరితో రైతులు యాసంగిలో పంటలు వేయాలో వద్దో తెలియక ఇబ్బందులు పడ్డారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను కేంద్రంలోని బీజేపీ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉంది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ నాయకులు దొంగ నాటకాలు ఆడుతున్నారు. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష.
– సాప శ్రీను, రైతు, గాజిరెడ్డిపల్లి, హవేళీఘనపూర్