సిద్దిపేట, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి: అధికారం కోసం కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రతి నెలా ఒకటో తారీకునే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పినా ఆచరణలో మాత్రం శూన్యం. ఒకటో తారీకు పోయి ఏడో తేదీ వచ్చినా ఇంకా 70 శాతానికి పైగా ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ఉద్యోగులు తమ జీతాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. సీఎం రేవంత్రెడ్డి, తన సహచర మంత్రులు చెబుతున్న మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తారీకునే జీతాలు చెల్లిస్తుందని చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. వాస్తవంగా జరుగుతున్న విషయం ఏమిటంటే బిల్లులు తక్కువగా ఉన్న ఎస్టీవోల నుంచి ఒకటో తారీకున విడుదల చేస్తున్నారు. దీంతో అందరికీ జీతాలు ఒకటో తారీకునే వేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.
సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏడో తారీకు వచ్చినా జీతాలు పడలేదు. కొద్ది మంది ఉద్యోగులకు జీతాలు వేసి అందరికీ వేశామని ప్రభుత్వం చెబుతుంది. సిద్దిపేట జిల్లా పరిధిలో హుస్నాబాద్, గజ్వేల్ పరిధిలోని ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. సిద్దిపేట, దుబ్బాక, తొగుట, చేర్యాల ఎస్టీవో పరిధిలోని ఉద్యోగులకు జీతాలు ఇంకా పడలేదు. సంగారెడ్డి జిల్లా పరిధిలో అందోల్, జహీరాబాద్, పటాన్చెరు, నారాయణఖేడ్, సంగారెడ్డి ఎస్టీవో పరిధిలోని ఉద్యోగుల్లో కొద్దిమందికి మాత్రమే జీతాలు పడ్డాయి. మెదక్, నర్సాపూర్ ఎస్టీవో పరిధిలో కూడా అంతే సంగతులు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వం ఒకటో తారీకునే ఉద్యోగులకు జీతాలు వేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధశాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకటో తారీకున జీతాలు వేయలేదని గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్న సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఎందుకు సకాలంలో వేయడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. చిన్న ఎస్టీవో పరిధిలో జీతాలు జమకాగానే తన ఎక్స్ వేదికగా సీఎం రేవంత్రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు తప్పా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు వేతనాలు ఒకటో తారీకున రిలీజు చేయడం లేదు. ఫిబ్రవరి 7వ తేదీ వచ్చినా జీతాలు పడలేదు అంటే .. కాంగ్రెస్ ప్రభుత్వ మార్పు ఏంటో కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకటో తారీకునే ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా ఒకేసారి జీతాలు వేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం.ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగుల పరిస్థితి కూడా అంతే. వీరు గ్రామాల్లో కీలక పాత్ర పోషిస్తారు.గ్రామాలు, పట్టణాల్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం, వారిని ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పాటు అందించడంతో పాటు గ్రూప్లోన్స్, బ్యాక్ రుణాలను మహిళా సంఘాలకు ఇప్పించడం, సకాలంలో రుణాల చెల్లింపుల్లో ఈ ఉద్యోగులది కీలక పాత్ర. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంతో పాటు ప్రతి సంక్షేమ పథకం అందేలా ఈ ఉద్యోగులు కృషి చేస్తారు. ఇంతలా కృషి చేస్తున్న తమకు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. కాంగ్రెస్ చెప్పిన మాటలకు మోసపోయామని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు వాపోతున్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒకటో తారీకు జీతాలు చెల్లిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. గతంలో కూడా విడతల వారీగా పలు జిల్లాల్లో జీతాలు జమయ్యేవి. ఇప్పటికీ విడతల వారీగా జిల్లాల్లో జీతాలు జమఅవుతున్నాయి. కానీ, ఒకటో తారీకునే రాష్ట్రం మొత్తం జీతాలు జమ చేసినట్లు విస్తృ్తత ప్రచారం జరుగుతున్నది. ఒక జిల్లాలో సైతం ఎస్టీవోల వారీగా ఇప్పటికీ జీతాలు జమఅవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక జిల్లాలో జీతాలు ఒకటో తారీకున జమఅయితే ముఖ్యమంత్రికి ఆ ఒక జిల్లా ఉద్యోగి ఎక్స్ వేదికగా తన భార్య ఆశ్చర్యపోయిందని చెప్పడం మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ప్రచారం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్రం మొత్తం ఒకేసారి ఒకటో తారీకు జీతాలు వచ్చినప్పుడు మెరుగుపడినట్లు భావించాల్సి వస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన మూడు డీఏల పై మంత్రులు తలోమాట మాట్లాడుతూ విడుదల చేసినట్లుగానే ప్రకటనలు చేస్తున్నారు.