జహీరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఇటీవల తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు పోలీసు అధికారులు సమావేశమయ్యారు. జహీరాబాద్ పట్టణ సమీపంలోని మహీంద్రా ఆండ్ మహీంద్రా విశ్రాంతి గృహంలో సంగారెడ్డి, కామారెడ్డి, బీదర్, కలబుర్గా జిల్లా ఎస్పీలు సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు. కర్ణాటక రాష్ర్టానికి జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్లు సమీపంలో ఉండడంతో సరిహద్దులో పోలీసు చెక్పోస్టులు ఏర్పాటు చేసి పరస్పర సహకారంపై మంతనాలు చేశారు. 65వ జాతీయ రహదారిపై చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్య వేక్షించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న 65 జాతీయ రహదారిపై చెరాగ్పల్లి, మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్ తండా, కోహీర్ మండలంలోని మనియార్పల్లి శివారు, గోటిగార్పల్లి పంచాయతీ పరిధిలోని సిద్దాపూర్తండా, న్యాల్కల్ మండలంలోని బీదర్-జహీరాబాద్ రోడ్డుపై గణేశ్పూర్, శంశోల్లాపూర్, డప్పుర్, హుసేనగర్ శివారులు సరిహద్దులున్నాయి. వీటిలో చెక్పోస్టులు మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు
అసెంబ్లీ ఎన్నికలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 313 పోలింగ్ కేంద్రాలున్నాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గంలో 292 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 52 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్లో 9 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. కోహీర్లో 16, చెరాగ్పల్లి11, హద్నూర్ 3, ఝరాసంగంలో 1 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి, అక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక పోలీసులను నియమించి పర్యవేక్షణ చేశారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు కదలికలపై నిఘా ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.
సరిహద్దులో ప్రత్యేక నిఘా..
తెలంగాణకు సరిహద్దు రహదారులపై పోలీసు, రెవెన్యూ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేసేందుకు పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. కర్ణాటకకు సరిహద్దులో ఉన్న గ్రామాలకు సమీపంలో తాత్కాలిక చెక్పోస్టులు ఏర్పాటు చేసి శాసన సభ ఎన్నికలు ముగిసే వరకు వాహనాలు తనిఖీలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్తుల కదిలికలపై నిఘా కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసేందుకు ఉన్నతా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నగదు, మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు తెలంగాణ వైపు రాకుండా నివారణ చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు చెక్పోస్టులో ఎస్ఐ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ చేసేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దులో బీదర్, చించోళి, హుమ్నాబాద్ తాలూకాలు ఉన్నాయి. అక్కడి పోలీసు అధికారులతో ప్రతి సమాచారం సేకరించి సమన్వయంతో పని చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.
అక్రమ రవాణాకు కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు..!