నారాయణఖేడ్, జనవరి 30 : ప్రజల మేలు కోరే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీని బలపర్చాల్సిన అవసరముందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి బీదర్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన సమావేశంలో ఏఐఎంఐఎం బీదర్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్ అహ్మద్ ఖాద్రీ సహా సుమారు 300 మంది మైనార్టీలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
సీఎం కేసీఆర్ విజన్ దేశానికి దిక్సూచి కాబోతుందని, రానున్న రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ అవతరిస్తుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, బీఆర్ఎస్ మాదిరిగా చిత్తశుద్ధితో పని చేసే ప్రభుత్వం కావాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
బీదర్ నడిబొడ్డున బీఆర్ఎస్ హల్చల్
కర్ణాటకలోని జిల్లా కేంద్రమైన బీదర్లో బీఆర్ఎస్ చేరికలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పట్టణంలోని మైనార్టీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి నీరాజనం పలికారు. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికిన స్థానికులు బీదర్లో ప్రసిద్ధ చౌబా రా నుంచి ఫ్రూట్ మార్కెట్ వరకు బ్యాండ్ మేళాలు మోగిస్తూ, పటాకులు కాల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఏఐఎంఐఎం నేత మన్సూర్ అహ్మద్ ఖాద్రి సహా జిల్లా, తాలుకా నాయకులు సకీర్ ఇనాందార్, ముస్తఫా, వహబ్ చౌదరి, ఎండీ జబ్బార్, అబ్దుల్ జబ్బార్, ఎండీ జుబేర్, అబ్దుల్ సలీమ్, అబ్దుల్ రవూఫ్, సుభాష్, శేఖర్, అబ్దుల్ హమీద్, ఎండీ షబ్బీర్, సయ్యద్ మహబూబ్, జకీర్, జబ్బార్ తదితర నేతలకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎంఏ. బాసిత్, మాజీ సర్పంచ్ ఎంఏ. నజీబ్, కౌన్సిలర్ మాజిద్, నాయకులు లయక్, సుదర్శన్రావు, నాగన్నశెట్కార్, బస్వరాజ్, మల్గొండ తదితరులు పాల్గొన్నారు.