రైతు కండ్లల్లో ఇప్పుడు ఒక్కటే ఆశ.. ఒక పెద్ద వాన పడితే చాలు అని. వానకాలం షురూ అయి నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వానలు కురువలే. దీంతో రైతులు దిగాలుగా ఉన్నారు. మొగులు దిక్కు కండ్లు కాయలు కాసేలా చూస్తూ.. వానదేవుడా కరుణించు అంటూ వేడుకుంటున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందనే ఆశ నెరవేరకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంటున్నది. పొలాలు సిద్ధం చేసుకుని.. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినా, వర్షా లు లేక వ్యవసాయం పనులు ప్రారంభించక రైతులు ఇ బ్బందులు పడుతున్నారు. వానలు పడడం ఆలస్యమైతే పంటల సాగు మరింత దెబ్బతిని, వ్యవసాయ రం గంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
సిద్దిపేట, జూలై 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానలు పడితే పంటలు పండించుకోవచ్చని మెతుకుసీమ రైతులు ఆశగా మొగులుకేసి చూస్తున్నారు. వానకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురవలేదు. దీంతో భూగర్భ జలమట్టాలు రోజురోజుకూ పడిపోతుండటంతో బోర్లు కూడా ఆశించిన స్థాయిలో నీటిని అందివ్వడం లేదు. చెరువులు, కుంట లు ఎండిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. మరో వారం రోజుల పాటు ఆశించిన వర్షాలు కురవకపోతే వానకాలం సాగు తీవ్రంగా దెబ్బతినే ప్రమా దం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పంటల భవితవ్యంపై ఆందోళన
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలపై ఆధారపడి వేసిన మొకజొన్న, పత్తి, సోయాబీన్, కంది పంటలు ప్రమాదంలో పడుతున్నాయి. వానలు కురవక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయాలి
సిద్దిపేట జిల్లాలోని కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పటికప్పుడు సాగునీటిని విడుదల చేసి ఆదుకున్న విషయాన్ని రైతులు గుర్తుచేస్తుకుంటున్నారు. తక్షణమే కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్ చేసి కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్లో 1.45 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 1 టీఎంసీ, మల్లన్నసాగర్లో 14.03 టీఎంసీలు, కొండపోచమ్మలో 6.375 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వర్షాలు లేక పచ్చిక బయ ళ్లు ఎండిపోతున్నాయి. పశువులకు మేత కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పాడి పరిశ్రమపైనా ప్రభా వం పడే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో చేతి పం పులు, చిన్న నీటి వనరులు ఎండిపోతుండటంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బిందెల సేద్యం..
మద్దూరు (ధూళిమిట్ట), జూలై14: వానకాలం ఆరంభంలో వానలు ముఖం చాటగేశాయి. ఆరుద్ర కార్తెలో కురిసిన వర్షాలకు రైతులు పంటలు సాగు చేశారు. ఆలస్యమైనా అప్పులు పెట్టి పెట్టుబడులు పెట్టారు. వానదేవుడు ముఖం చాటేయడంతో పత్తి, మొక్కజొన్న, కంది తదితర మొక్కలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. మొక్కలు కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లికి చెందిన చల్లా పర్శిరెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. కండ్లముందే పంటలు ఎండిపోతుండడంతో బిందెల్లో నీళ్లు తెచ్చి మొక్కలకు ‘జీవిగంజి’ పోసినట్లు నీళ్లు పోస్తున్నాడు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఎండుతున్న మొక్కలు చూడలేక..
రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేసిన. పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి.. బోర్లల్లో నీళ్లు లేక బోర్లు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పటికే రూ.60వేల పెట్టుబడి పెట్టిన. రోజూ బకిట్లల్ల, బిందెలల్ల నీళ్లు తెచ్చి మొక్కలకు పోస్తున్న. నేను బుద్ధి నేర్పినప్పటి నుంచి రైతులకు గింత కష్టమెన్నడు రాలే. పంటలు ఎండిపోతే రైతులు నష్టపోయి ఆగమయ్యే పరిస్థితులు ఉన్నాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలె.
– చల్లా పర్శిరెడ్డి, రైతు, నర్సాయపల్లి, మద్దూరు మండలం (సిద్దిపేట జిల్లా)
కాలం గిట్లయితే బతికేదెట్లా?
నాకు రెండెకరాల ఖుష్కి ఉంది. దానికి తోడు మరికొంత భూమి కౌలుకు తీసుకున్నా. కార్తె అదును సూసి నారువోసిన. ఇప్పడిదాక చినుకుపడలేదు. నారు ఏతకొస్తున్నది. రెండబోర్లల్లో నీళ్లు తగ్గాయి. కాలం నెత్తిమీదకొచ్చినా, ఇంకా వానలు పడుతలేవు. అప్పులు జేసి ఎరువులు, విత్తనాలు తెచ్చిన, ఎరువులు పోసిన. కాలంగిట్లయింది. బతికేదెట్లా?
– రాయారం కిష్టయ్య, రైతు, సింగాయిపల్లి, వర్గల్ మండలం (సిద్దిపేట జిల్లా)
