రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు వేయాలని, ఆరు గ్యారెంటీల అమలుకు ఒత్తిడి తెస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లి, శివ్వంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఆమె ప్రజాపాలనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి విస్మరించారన్నారు.
కౌడిపల్లి, జనవరి 5 : ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమచేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్, తునికి, వెంకట్రావుపేట్, వెంకటాపూర్ ఆర్ గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. వెంకట్రావుపేట్లో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ తారబాయి, ఎంపీటీసీ సాజిద్ పాషా, సర్పంచులు, పీఏసీఎస్ డైరెక్టర్ గాదె రాయగిరి, తునికి ఆలయ కమిటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ ప్రతాప్గౌడ్, ఆంజనేయులు, నర్సింహులు, రాజు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
శివ్వంపేట, జనవరి 5 : ఆరు గ్యారెంటీల పథకాల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొంతాన్పల్లి గ్రామం లో నిర్వహించిన ప్రజాపాలనను సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్చారితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషిచేయాలన్నారు. భూ సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించారు. మండలంలోని ఏదుల్లాపూర్, గంగాయిపల్లి, కొత్తపేట, బిక్యతండాల్లో ప్రజాపాలన నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో భారతి, ఎంపీవో తిరుపతిరెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు నాగేశ్వర్రావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుదర్శన్గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.