సిద్దిపేట, డిసెంబర్8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేఖ పంపడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదం పొందడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. శుక్రవారం (నేడు) తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ పార్టీ జెండాను మధ్యాహ్నం 1.20 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుతో పాటు సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించగానే జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబురాలు చేసే విధంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తెలంగాణ నుంచి జాతీయస్థాయికి…
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వరకు పరిమితమైన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్తో జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. పార్టీ పేరును మారుస్తూ సీఎం కేసీఆర్ అక్టోబర్ 05 (విజయదశిమి) రోజున నిర్ణయించి, అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యమని టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ రాజీనామా చేశారు. అదేరోజు ఉదయం కోనాయిపల్లి వెంకన్నస్వామి ఆశీర్వాదం తీసుకొని టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. పార్టీ జెండాతో పాటు సాహిత్యం, పాటల క్యాసెట్లను దేవుని సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు.అనంతరం భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్ వెళ్లి జలదృశ్యంలో పార్టీని ఏర్పాటు చేశారు. 14ఏండ్ల తర్వాత తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర నాయకుల ఎత్తులను చిత్తు చేసిన వ్యూహకర్త కేసీఆర్. ఒక్కడుగా కదిలి..అందరినీ ఏకంచేసి.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్వరాష్ట్రం సాధించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్.
ఆశీర్వదించిన ప్రజలు…
తెలంగాణ రాష్ట్రం సాధించిన బిడ్డగా సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించారు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయి. ఇక్కడి పథకాలు, అభివృద్ధి పనులు యావత్తూ దేశానికి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గడిచిన ఎనిమిదన్నర ఏండ్లలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. సీఎం కేసీఆర్ నిరంతర కృషి, ఒక విజన్తో ముందుకు వెళ్లడంతోనే ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో దూసుకపోయిన ‘కారు’.. ఇక జాతీయ స్థాయిలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోనున్నది.