తొగుట, అక్టోబర్ 29: పవర్ ప్లాంట్ నిర్మాణం అసత్య ప్రచారమని, ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి, సింగరాయి మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వాహించారు. లింగాపూర్, బం జరుపల్లి, చందాపూర్, రాంపూర్, తోగుట గ్రామాల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కొత్త ప్రభాకర్రెడ్డికి ప్రజలు డప్పు చప్పుళ్లు, బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాతి పాలన బాగుంటే కూలీలు తెలంగాణకు ఎందుకు వలస వస్తున్నారని ప్రశ్నించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చిన నాయకులు ఎన్నికల తర్వాత ప్రజల మధ్య లేకపోవడం విడ్డూ రంగా ఉందన్నారు. బీజేపీకి ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధనాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి అతి తక్కువకాలంలో చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులతో దుబ్బాక నియోజకవర్గంలో లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎండాకాలంలో గోదావారి నీటిని కుడవెళ్లి వాగులోకి తరలించి రైతుల పంటలను కాపాడిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులదేనన్నారు. గత ప్రభుత్వల హయాంలో తాగు, సాగు నీటికి ప్రజలు అల్లాడిపోయారని ఆనాటి సంఘటనలను గుర్తు చేశారు. గోదావరి నీరు ఇక్కడికి రావడం మన అదృష్టమని, సీఎం కేసీఆర్కు ప్రజలు, రైతులు రుణపడి ఉంటారని చెప్పారు. అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆదరించాలని, కారు గుర్తుకు ఓటు వేసి దుబ్బాకలో, రాష్ట్రంలో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ హరికిషన్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంకాత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొమురయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గోవర్ధన్, సర్పంచ్లు రజితాశ్రీశైలం, చిలువేరు జ్యోతి, మల్లారెడ్డి, మంజులాసత్యనారాయణ, శ్యామల అంజనేయులు, లీలాదేవి వెంకటేశం, ఎంపీటీసీ సుతారి లతారమేశ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు కనుకయ్య, వెల్పుల స్వామి ముదిరాజ్, మార్కె ట్ కమిటీ వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి, నాయకులు పబ్బతి శ్రీనివాస్రెడి ఉన్నారు.