పటాన్చెరు, మార్చి 4: సంగారెడ్డి జిల్లా వేదికగా ప్రధానిమోదీ వర్చువల్గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంగళవారం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పటాన్చెరు పట్టణ పరిధిలోని పటేల్గూడ వెళ్లే దారిలో జరుగనున్న అధికారిక ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డితో కలిసి హాజరవుతారు. అనంతరం పక్కనే ఉన్న గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. వర్చువల్ విధానంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. జాతీయ స్థాయి భద్రత బృందాలు భారీ రక్షణ చర్యలు చేపట్టాయి. ప్రధాని వ్యక్తిగత భద్రత సిబ్బంది సూచనల మేరకు అక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ కేంద్ర బృందాలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నారు. కార్యక్రమానికి బీజేపీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు హాజరవుతారు.