రామాయంపేట, మార్చి 24 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ స్పష్టం చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటకు విచ్చేసిన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ను బీఆర్ఎస్ కార్యకర్తలు సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రగతిని చేసి చూపెడుతున్నామన్నారు. ప్రతి గురుకుల పాఠశాలలో డిగ్రీ వరకు కేజీ టు పీజీని చేశామన్నారు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాలను ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని బలోపేతం చేశామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, సీఎంఆర్ఎఫ్ తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. పల్లె ప్రాంతాల్లో వృద్ధ్దులకు, బీడీకార్మికులకు, దివ్యాంగులకు పింఛన్లను ఇచ్చి ఆదుకుంటుంది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. సాగు, తాగునీటిని అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. అన్ని కులసంఘాలకు ఆత్మగౌరవ భవనాలను మంజూరు చేసి కట్టించామన్నారు. విద్యుత్, విద్య, వైద్య రంగంలో ఉద్యమం లాగా పల్లెలకు పూర్వవైభవం తెచ్చామన్నారు.ప్రతి ప్రభుత్వ దవాఖానల్లో మాతాశిశు కేంద్రాలను ఏర్పాటు చేసి తల్లీబిడ్డకు మంచి వైద్యం అందిస్తున్నామని అన్నారు. ప్రతి ప్రభుత్వ దవాఖానను వంద పడకల దవాఖానగా ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నామని ఈ సమ్మేళనాలతో ప్రజల ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి, రాకముందు పరిస్థితులను ప్రజలకు వివరిస్తామన్నారు. బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ముందుకు వెళ్తుందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పుట్టి అక్షయ్ కుమార్, అల్లుడు జగన్, మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి, నిజాంపేట మండల నాయకులు లక్ష్మి నర్సింహులు, దయాకర్, మావూరం రాజు, లచ్చపేట రామాగౌడ్ ఉన్నారు.