రాయపోల్, ఆగస్టు 14 : వర్షాల కారణంగా దౌల్తాబాద్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అరుణ్ కుమార్ ప్రజలకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు. రైతులు, ప్రజలు విద్యుత్ స్తంభాలకు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనదారులు రోడ్డుమీద అత్యంత వేగంగా ప్రయాణించవద్దన్నారు. గ్రామాల్లో కల్వర్టుల పరిసర ప్రాంతాల్లో ఉండవద్దని కొందరు యువకులు చెరువులు వాగుల్లో ఈతకు, చేపలు పట్టేందుకు వెళ్లవద్దని సూచించారు.
ముఖ్యంగా గొర్రెల కాపర్లు చాలా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద ఉండరాదని, రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేటప్పుడు కరెంటు మోటార్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో సహాయం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడు సిద్ధంగా ఉందని గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్100 ద్వారా పోలీసులకు సంప్రదించాలని దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ మండల ప్రజలకు సూచించారు. మూడు రోజులపాటు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలను చెరువుల వద్దకు పంపవద్దని, గ్రామాల్లో ఇండ్ల వద్ద కరెంటు వైర్లకు తాకవద్దని గుర్తు చేశారు. మండల ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవ చేస్తామని ఈ సందర్భంగా అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.