న్యాల్కల్, అక్టోబర్ 13: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అందుకు నిదర్శనం న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ గ్రామం. మండలంలోని అన్ని గ్రామాల కంటే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఆ గ్రామ సర్పంచ్ కృషి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారం అభినందనీయం. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రగతిలో దూసుకుపోతున్నది. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఎంపీ బీబీపాటిల్, జడ్పీటీసీ స్వప్నకుమారి, ఎంపీపీ అంజమ్మ, సహకారంతో సర్పంచ్ జయశ్రీరెడ్డి గ్రామాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్నారు.
గంగ్వార్ గ్రామంలో 1,500 జనాభా ఉంది. అందులో 1200 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో మురుగు కాల్వలు నిర్మించారు. అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనానికి రూ.4 లక్షల వ్యయంతో పూర్తిచేశారు. గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో రూ.4 లక్షలతో హైమస్ట్ లైట్లు ఏర్పాటుచేశారు. జహీరాబాద్ ఎంపీ కోటాలోనూ హైమస్ట్ లైట్లు, అన్ని వార్డుల్లో ఎల్ఈడీ బల్పులు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో గ్రామ ప్రధాన చౌరస్తాలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ నిర్మించారు. యువకులు, క్రీడాకారుల సౌకర్యార్థం 3 ఎకరాలకు పై చిలుకు స్థలంలో క్రీడా మైదానాన్ని నిర్మించారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శితో నాలుగురు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్వవేక్షిస్తూ, ప్రతి రోజు గ్రామంలో ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సొంత ఖర్చుతో గ్రామంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రార్థనా మందిరాలు, ఆలయాల అభివృద్ధికి సర్పంచ్ జయశ్రీరెడ్డి పాటుపడుతున్నారు.
గ్రామంలో పల్లె ప్రగగతిలో భాగంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పచ్చని అందాలతో స్వాగతం పలుకుతుంది. ఇందులో రకరకాల మొక్కలతోపాటు గ్రామ ముఖద్వారానికి ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. వైకుంఠధామంలోనూ ఏపుగా పెరిగిన చెట్లు, మధ్యలో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటున్నది. చౌరస్తాలోని డివైడర్పై నాటిన మొక్కల పచ్చందాలతో ప్రయాణికులు, వాహనచోదకులకు ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తాయి. రోజూ మొక్కలకు పంచాయతీ ట్రాక్టర్, వాటర్ ట్యాంకుతో నీళ్లు పట్టి, సంరక్షిస్తున్నారు.
మండలంలో ప్రధాన చౌరస్తాగా గంగ్వార్ మారింది. మండలంలోని గ్రామాల ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు గంగ్వార్ చౌరస్తాకు రావాల్సిందే. ఇక్కడి నుంచే జహీరాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, బీదర్, బాల్కి, ఉద్గీర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు వాహన సౌకర్యం ఉంటుంది. అనతి కాలంలోనే చౌరస్తాలో అభివృద్ధి చెందింది. వ్యాపార దుకాణాలు, హోటళ్లు, పెట్రోల్ బాంకులు ఏర్పాటయ్యాయి. జహీరాబాద్-బీదర్ ప్రధాన రోడ్డు మార్గం కావడంతో రోజూ ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో గంగ్వార్ చౌరస్తా కిక్కిరిపోతున్నది. చౌరస్తాలో ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్లు, ప్రత్యేక పార్కుల్లోని మొక్కల పచ్చని అందాలతో ఆకట్టుకుంటున్నాయి.
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామంటే సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతోనే సాధ్యమైంది. ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీకి నిధులు విడుదల చేస్తున్నది. ఈ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నాం.
– జయశ్రీరెడ్డి, సర్పంచ్, గంగ్వార్, న్యాల్కల్