సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 13 : జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల పంపిణీ పథకం అమలు కోసం అనుసరించాల్సిన విధి విధానాలు, చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత కింద 10,331 మంది లబ్ధ్దిదారులకు గొర్రెల పంపిణీ పథ కం అమలు చేయాల్సి ఉందన్నారు. దీని కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, జిల్లాలో గొర్రెల పంపిణీ అమలు జరిగేలా సిద్ధం కావాలన్నారు. పశు వైద్యాధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల సభ్యులు, లబ్ధ్దిదారుల సమావేశాలు ఏర్పాటు చేసి గొర్రెల పంపిణీ అమలు, విధి విధానా లపై అవగాహన కల్పించాలన్నారు.
మండల స్థాయిలో మండల ప్రత్యేకాధికారులు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘ, అధ్యక్ష, కార్యదర్శులు, సంబంధిత వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని ఆదేశించారు. లబ్ధ్దిదారుడి వాటా ధనం ఇంకా చెల్లించని వారి నుంచి వాటా ధనం సేకరించాలని ఆదేశించారు. రెండో విడత గొర్రెల పం పిణీ కోసం ఎంపికైన లబ్ధిదారుల జాబితాలో మృతి చెందిన వారిని గుర్తించాలని, వారి స్థానంలో వారి నామినీలకు యూని ట్ అందించేలా, ఎంపిక చేయాలని సూచించారు. ఆయా ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పశు సంవర్ధక శాఖ జేడీ వసంతకుమారి, అసిస్టెంట్ డైరెక్టర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ఆర్డీవోలు పాల్గొన్నారు.