అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, నగదు అందజేత.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. గల్లీగల్లీలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారం.. పెండింగ్ పనులు పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు ఆదేశిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్ తప్పా మిగతా అన్ని అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగులకే బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సీట్లు కేటాయించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులు ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచార తీరు మాదిరిగా ప్రజలతో మమేకమతున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని బీఆర్ఎస్లో చేర్చుకుంటూ గులాబీ పార్టీలో జోష్ నింపుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మంత్రి హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యన ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. కాగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు కాకపోవడం, టికెట్ పంపకాల్లో పంచాయితీలు నెలకొనడంతో ఆ పార్టీల క్యాడర్లో నిస్తేజం నెలకొంది. బీఆర్ఎస్లో శ్రేణులు మాత్రం దూకుడుగా ప్రజల ముందుకు వెళ్తున్నారు.
– సిద్దిపేట,సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ. జిల్లా నేతలు ప్రజల మధ్యే ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు ఎమ్మెల్యేలు విడమరిచి చెబుతున్నారు. ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకం అందిన విషయాన్ని నొక్కి చెప్పుతున్నారు. ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతుబంధు, రుణమాఫీ… ఇలా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. వీటికి తోడు ఎన్నడూ లేనంతగా గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎంతగానో అభివృద్ధి జరిగింది. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు వెళ్తూ..ని త్యం ప్రజల మధ్యన ఉంటూ.. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లాలకు కావాల్సిన నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఇంకో వైపు బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ అండగా ఉంటున్నారు. మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. త్వరలోనే జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని చోట్ల సిట్టింగులకే అవకాశం కల్పించారు. దీంతో పార్టీ క్యాడర్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి పదికి పది స్థానాలు గెలుచుకొని సీఎం కేసీఆర్కు కానుక ఇవ్వాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని మంత్రి హరీశ్రావు ముందుకు తీసుకువెళ్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రతి పక్ష పార్టీల అభ్యర్థులు ఎవరో తెలియని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, గ్రూపులు, ముష్టియుద్ధాలతో కొట్టు మిట్టాడుతున్నది. ఇక బీజేపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొన్నది.
నిత్యం ప్రజల మధ్యనే మంత్రి హరీశ్రావు
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ఓపిగ్గా వింటూ పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల పర్యటనకు వెళ్తూ అక్కడి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉమ్మడి మెదక్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సమయం దొరకగానే ఇటు సిద్దిపేట నియోజకవర్గంతో పాటు అటు ఉమ్మడి మెదక్ జల్లాలోని పలు నియోజకవర్గాలను చుట్టేసి వస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను సావధానంగా వింటూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారు.నిత్యం క్యాంపు కార్యాలయం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సందడిగా ఉంటుంది. మొదట ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసిన తర్వాతనే మిగతా పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మధ్యాహ్న భోజనం పెట్టి పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో తానే స్వయంగా వడ్డిస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. ఒక సిద్దిపేట నియోజకవర్గం వారే కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి వారి సమస్యలను మంత్రి హరీశ్రావుకు చెప్పుకుంటారు. తనరోజు వారి పర్యటనలో (ఒక రోజుకు) సరాసరి 20 నుంచి 30 మధ్యన కార్యక్రమాలు ఉంటాయి.అధికారులతో సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతూనే ఉంటాయి.
ప్రతిరోజు ప్రజా సమస్యలు విని…
ప్రతిరోజు క్యాంపు కార్యాలయంలో ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసి వారి సమస్యలను విని గ్రామాల పర్యటనకు వెళ్తున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధితో పాటు, సంక్షేమ పథకాలను ప్రజలకు విడమరిచి చెబుతున్నారు. నారాయణఖేడ్ ఎమ్యెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన పనులను వివరిస్తున్నారు. మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి గ్రామాలు, మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు కొత్తగా మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజలతో కలిసి ఉంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాణిక్యరావు రోజూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో తరుచూ సమావేశమవుతున్నారు.
గ్రామాలను చుట్టేస్తున్న ఎమ్మెల్యేలు
తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకుపోయేలా పక్కా ప్రణాళికతో ఎమ్మెల్యేలు ముందుకు కదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు పుష్కలంగా సాగునీరు వచ్చింది. ఫలితంగా ఎన్నడూ లేనంతగా జిల్లాలో పంటలు పండుతుండగా రైతులు సంతోషంగా ఉన్నా రు. తమది రైతు ప్రభుత్వమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ నర్సాపూర్ (పెండింగ్లో) మినహా జిల్లాలో సిట్టింగ్లకే మళ్లీ అవకాశం ఇవ్వడంతో పార్టీ (అభ్యర్థులు) ఎమ్మెల్యేలు స్థానిక నాయకత్వం, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి సమష్టిగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నా రు. తమ తమ క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజ ల సమస్యలను వింటూ పరిష్కరానికి కృషి చేస్తున్నారు. దుబ్బాక నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలను చుట్టి వస్తున్నారు. దుబ్బాకలో పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తున్నారు.
గజ్వేల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసికట్టుగా సీఎం కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీకి స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో ఆమె రెట్టించిన ఉత్సాహంతో గ్రామాలను చుట్టి వస్తున్నారు. నర్సాపూర్లో(అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది) స్థానిక ఎమ్మెల్యే మదన్రెడ్డి అధికార కార్యక్రమాల్లో పాల్గొం టూ సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని ప్రజలను కోరుతున్నారు. ఆందోల్లో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ బరిలోకి దిగుతున్నారు.