సిద్దిపేట, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత అందరిలోనూ ధైర్యం వచ్చింది. సత్వర సేవలు అందించేందుకు ధరణి పోర్టల్ను ప్రారంభించి రైతులకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచేలా రూపొందించారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా తహసీల్దార్కు అధికారం బదలాయించడం జరిగింది. దీంతో స్థానికంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు సాఫీగా జరుగుతున్నాయి. ఆయా మండల కేంద్రాల్లో రిజిస్ట్రేషన్తో పాటు వెంటనే సంబంధిత మార్పిడి ఉత్తర్వులు యజమానికి అందజేస్తున్నారు. తహసీల్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు, నిమిషాల్లోనే మ్యుటేషన్, ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వస్తున్నాయి.
సులభంగా పారదర్శకంగా సేవలు
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల వేగంగా, సులభంగా, తేలిగ్గా, పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా ధరణిలో పుల్ సేవలు అందుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసేదే ధరణి పోర్టల్. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది. లంచాలు లేకుండా, పారదర్శకంగా పట్టా పాసుబుక్కులు అందిస్తున్నారు. నిర్దేశిత గడువుతో ధరణిలో భూసమస్యలకు పరిష్కారం కోరుతూ వచ్చిన దరఖాస్తులకు వెనువెంటనే పరిష్కారం లభిస్తుంది. భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే సీఎం కేసీఆర్ ధరణికి తీసుకొచ్చారు.గతంలో పట్వారీ వ్యవస్థ ఉన్న సమయంలో రైతులకు తెలియకుండానే సర్వే నంబర్లు మారడం, భూములు మారడం. ఒక రైతు భూమి మరో రైతు పాసుబుక్కులో ఎక్కించడం ఇలా ఎన్నో రకాలుగా జరిగేవి. ఫలితంగా రైతులు అనేక ఇబ్బందులు పడే వారు. గత ప్రభుత్వాల హయాంలో డబ్బులు ఇస్తే రాత్రికి రాత్రే సర్వే నంబర్లతో సహ, రైతుల భూముల వివరాలు ఇంకో రైతుకు తెలియకుండానే పట్వారీలు డబ్బులకు ఆశపడి ఇష్టారీతిగా ఎక్కించేవారు. ఒక సర్వే నంబర్లో ఉన్న భూ విస్తీర్ణానికి… రికార్డుల్లో ఉన్న భూములకు పొంతన ఉండేది కాదు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిగా రికార్డులు మారేవి. సామన్య ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు . పహాణీల్లో రాత్రికి రాత్రే రికార్డులు మార్చడం జరిగాయి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రాయించుకునే వారు. దీంతో భూముల లెక్కలు మారడంతో తరచూ భూ తగాదాలు జరిగేవి. దీనివల్ల ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం లాంటివి ఎన్నో చూశాం. ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. భూములకు ధరణితో భద్రత ఉంది. ధరణి మన ధైర్యంగా నిలిచింది.
భూతగాదాల శాశ్వత పరిష్కారానికే ‘ధరణి’
భూతగాదాల శాశ్వత పరిష్కారానికి ధరణి పోర్టల్ మంచి అవకాశంగా నిలిచింది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అయినా దేశంలో భూతగాదాలు పరిష్కారం కావడం లేదు. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల్లో సగానికి పైగా భూతగాదాలకు సంబంధించినవే . భూ వివాదాల వల్ల సమయాన్ని, ఆదాయాన్ని, మనశ్శాంతిని రైతులు కోల్పోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోని సీఎం కేసీఆర్ ధరణికి శ్రీకారం చుట్టారు. ఇవ్వాళ ధరణితో ఎంతో ప్రయోజనం కలుగుతున్న ది. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం భూముల విషయాల్లో తలదూర్చే అవకాశం లేనంత పారదర్శకంగా ధరణి పోర్టల్ ఉంది. భూముల రికార్డులను వ్యక్తుల చేతుల్లో నుంచి ధరణి వ్యవస్థలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది.
ధరణిలో భూ వివరాలు ఎక్కిందంటే జిల్లా కలెక్టర్కు కూడా తొలిగించే, సవరించే అధికారం లేదు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్ సభ్యుడిగా భూ వివాదాల సత్వర పరిష్కారానికి ట్రిబ్యునల్. పెండింగ్ మ్యుటేషన్లు అమలు చేస్తున్నారు. పనిలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతున్నారు. భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఆస్తుల బదిలీలకు జవాబుదారి తనంగా ధరణి నిలిచింది. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సరళీకృతం చేశారు. భూమి, ఆస్తి సంబంధిత సమచారాన్ని ఆన్లైన్లో ఉంచారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, వ్యవసాయ భూముల నమోదు, వారసత్వం విభజన సరళీకృతం చేయడానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నారు. లావాదేవీలు జరిగిన కొద్ది నిమిషాల్లోనే సం బంధిత భూ మార్పిడి ఉత్తర్వు పత్రాలను భూ యజమానికి అందజేస్తున్నారు. ఇ- పట్టాదారు పాస్బుక్ను భూ యజమానులకు అందించడం ధరణి ప్రత్యేకత అని చెప్పవచ్చు.
15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్
గతంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజంతా జరిగేది. ఇప్పుడు తహసీల్ కార్యాలయంలో15 నిమిషాల్లో జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. రైతుల సాధక, బాధకాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ సారు సులువుగా భూముల రిజిస్ట్రేషన్తో పాటు మ్యుటేషన్ చేయిస్తుండటంతో రైతులకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పంది. గతంలో భూములు కొనేది ఒక ప్రక్రియ అయితే పట్టా చేసుకునుడు మరోలా ఉండేది. దీంతో ఏండ్లకు, ఏండ్లు కార్యాలయాల చుట్టూ తిరిగేది. పట్టాలు కాకుండానే చనిపోయినా రైతులు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆ బాధ తప్పింది. ధరణి సేవల ద్వారా రైతులకు మేలు కలుగుతున్నది. ధరణి విషయంలో సీఎం కేసీఆర్ రైతే రాజు అనేలా చేశాడు. గతంలో భూముల రిజిస్ట్రేషన్ అంటే అధికారుల చుట్టూ తిరిగేది. ఇప్పుడు రైతు కోరిన రోజు అధికారులు అందుబాటులో ఉండి అప్పటికప్పుడు పారదర్శకంగా, ఎలాంటి పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సారుకు రైతుల తరపున ప్రత్యేక కృతజత్ఞలు – జీల శ్రీనివాస్,
యువరైతు, అక్కన్నపేట
రూపాయి ఖర్చు లేదు..
ధరణి వచ్చిన తర్వాత రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. గతంలో ఈసౌలత్ లేకుండే. రిజిస్ట్రేషన్ కావాలంటే బాగా తిప్పలయ్యేది. మా భూమి మాకు కావాలన్నా.. అమ్మితే రిజిస్ట్రేషన్ చేయాలన్నా పట్వారీల దగ్గరికి పోయి రాయించుకొని వచ్చేది. ఇప్పడు ఆబాధ లేదు. రిజిస్ట్రేషన్ కోసం సిద్దిపేటకు వెళ్లేవాళ్లం..కానీ నేడు నారాయణరావుపేట తహసీల్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ అయితుంది. మాలాంటి వారికి ఎంతో ఉపయోగం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు.
– కొడకండ్ల బుధవ్వ, గ్రామం లక్ష్మీదేవిపల్లి, నారాయణరావుపేట మండలం
సులువుగా రిజిస్ట్రేషన్
ధరణి పోర్టల్ చాలా బాగుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేయాలంటే పహాణీలకు, ఇతర డాక్యుమెంట్లకు చాలా ఇబ్బంది ఉండేది. మ్యుటేషన్ కోసం 45రోజుల పాటు ఆగాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా ఉంది. గతంలో పాస్బుక్ కావాలంటే సమయం పట్టేది. నేడు వెంటనే వస్తుంది. కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పింది. దీని వల్ల రైతులకు మేలు కలుగుతుంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– అందె శ్రీనివాస్రెడ్డి, మిట్టపల్లి, సిద్దిపేట మండలం
పైరవీకారుల లొల్లితప్పింది
ధరణి పోర్టల్ రాకముందు తహసీల్ కార్యాలయాల్లో పైరవీకారులదే పెత్తనం నడిచేది. పాసుపుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా రాకపోయేది. ధరణి వచ్చిన తర్వాత మోసాలు జరగడం లేదు. భూమి వివరాలను ఎప్పటిప్పుడు ఆన్లైన్లో చూసుకోవచ్చు. పట్టా మార్పిడి కూడా అరగంటలోనే వొడిసిపోతుంది. ధరణితో రైతుల బాధలు తప్పాయి.
– భూర్గు నర్సింహులు, రైతు, మద్దూరు
సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు
కొమురవెల్లిలో మూడు ఎకరాలు కొనుగోలు చేశా. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. 10నిమిషాల్లోనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. అధికారులు రిజిస్ట్రేషన్ కాగితాలు నాకు అప్పగించారు. నా దగ్గర ఉన్న పాస్బుక్ తీసుకొని అందులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి ఎక్కించి పాస్బుక్ ఇచ్చారు. కార్యాలయాల చుట్టూ తిరుగుడు లేదు. ఎవరికీ పైసలు ఇచ్చేది లేదు. ధరణి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు.
– నర్ర రఘువీరరెడ్డి, రైతు, గౌరాయపల్లి, కొమురవెల్లి మండలం