పటాన్చెరు/ రామచంద్రాపురం, ఫిబ్రవరి 10: సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లు అభివృద్ధికి కేరాఫ్గా మారాయి. సీఎం కేసీఆర్ హయాంలో మంత్రి హరీశ్రావు కృషితో రాష్ట్ర ప్రభుత్వం రూ.వందల కోట్ల నిధులు విడుదల చేస్తుండగా, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నాయి. విశాలమైన రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ఇంటింటికీ తాగునీరు, నాణ్యమైన విద్యుత్, థీమ్ పార్కులు, స్టేడియాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఓపెన్జిమ్లు, మోడల్ రైతుబజార్లు, బస్తీ, ఏరియా దవాఖానలు ఇలా ఎన్నో మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. బల్దియా ఎన్నికల్లో గెలిచి రెండేండ్లు ప్రజారంజక పాలన అందించిన కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, సింధూ ఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్ ముచ్చటగా మూడో వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ రెండేండ్లలో పటాన్చెరులో రూ. 117.63 కోట్లు, భారతీనగర్లో రూ.28కోట్లు, ఆర్సీపురం డివిజన్లో రూ.30.50 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ శివారులోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. ఈ డివిజన్లలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో భారీగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. బల్దియాలోని డివిజన్ల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. బల్దియా ఎన్నికలు జరిగి నేటితో రెండేండ్లు పూర్తయింది. ఈ కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, భారతీనగర్, ఆర్సీపురం డివిజన్లు ఎంతో అభివృద్ధి చెందాయి. ఈ డివిజన్లలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. ప్రతి కాలనీలో సీసీ, బీటీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ లైన్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, థీమ్ పార్కులు, వాకింగ్ ట్రాక్లు, కమ్యూనిటీహాళ్లు, మోడల్ రైతు బజార్, వీధి దీపాలు, ఓపెన్ జిమ్, స్ట్రాంవాటర్ డ్రైన్స్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అడిగిందే తడవుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నది.
రెండేండ్ల కాలంలోనే పటాన్చెరు డివిజన్లో 117.63 కోట్లు, భారతీనగర్ డివిజన్లో రూ.28కోట్లు, ఆర్సీపురం డివిజన్లో రూ.30.50 కోట్లతో అభివృద్ధి చేశారు. పటాన్చెరు సర్కిల్లోని మూడు డివిజన్లలో జరిగే అభివృద్ధి పనులకు మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ సహకారం నిరంతరం ఉంటున్నదని కార్పొరేటర్లు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పానగేశ్, సింధూ ఆదర్శ్రెడ్డి ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో రానున్న కాలంలో మరింత బాధ్యతగా పనిచేస్తామని చెబుతున్నారు.
పటాన్చెరులో రూ.117.63 కోట్ల అభివృద్ధి; పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్
పటాన్చెరులో రెండేండ్ల కాలంలో రూ.117 కోట్ల 63 లక్షల అభివృద్ధి పనులు చేసినట్లు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. గాంధీ థీమ్ పార్కు, విశాలమైన రోడ్లు, పచ్చదనం, బస్తీ దవాఖానలు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. మైత్రి మైదానం, పీజీ విద్య, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల్లో నూతన గదులు అందుబాటులోకి వచ్చాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్లో రూ.కోటీ 21లక్షలు అందజేశామన్నారు. 2021-22లో రూ.55 కోట్ల 51 లక్షల పనులు, 2022-23లోరూ.52 కోట్ల 12 లక్షల పనులు చేశామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ; భారతీనగర్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి
కార్పొరేటర్గా మంచి మెజార్టీతో రెండోసారి భారతీనగర్ ప్రజలు గెలిపించారని సింధూ ఆదర్శ్రెడ్డి అన్నారు. రెండేండ్ల కాలంలోనే డివిజన్లో రూ.28 కోట్ల అభివృద్ధి పనులు చేయించామన్నారు. సీసీ రోడ్లకు రూ.10 కోట్లు, అంతర్గత డ్రైనేజీ లైన్లకు రూ.2.5 కోట్లు, పార్కులకు రూ.50 లక్షలు, మోడల్ రైతు బజార్కు రూ.4.80 కోట్లు, కమ్యూనిటీహాల్స్, వార్డు కార్యాలయ నిర్మాణానికి రూ.కోటి, ఓపెన్ జిమ్స్ రూ.36 లక్షలు, మిషన్ భగీరథకు రూ.8.5 కోట్లతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా మంత్రి హరీశ్రావు, ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సహకారంతో డివిజన్ అభివృద్ధికి నిధులు తెస్తున్నామన్నారు.
ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం ; ఆర్సీపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం గా ముందుకు సాగుతున్నామని ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నగేశ్ తెలిపారు. డివిజన్లో రూ.30.50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతికాలనీలో సీసీ రోడ్లు, యూజీడీ లైన్లు పునరుద్ధరించినట్లు తెలిపారు. డివిజన్లో రూ.10.28 కోట్లతో సీసీ రోడ్లు, రూ.6.84 కోట్లతో యూజీడీ లైన్లు, రూ.3.70 కోట్లతో బాక్స్ డ్రైన్, రూ.3 కోట్లతో థీమ్ పార్కు, రూ.3 కోట్లతో గ్రేవ్యార్డ్, రూ.85 లక్షలతో చైన్ లింక్మెష్, రూ.1.98 కోట్లతో నాలాల పూడికతీత, రూ.20 లక్షలతో వార్డు కార్యాలయ పునరుద్ధరణ, రూ.15 లక్షలతో విద్యుత్ లైట్లు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
అభివృద్ధిలో తగ్గేదేలేదు ; పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో వెనక్కి తగ్గేదేలేదని, పటాన్చెరు, భారతీనగర్, రామచంద్రాపురం మూడు డివిజన్లు గ్రేటర్ హైదరాబాద్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేయాలని కార్పొరేటర్లకు తరచూ చెప్తుంటానన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంతో పాటు మూడు మున్సిపల్ డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రెండేండ్లు పూర్తి చేసుకున్నందుకు కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ప్రోత్సాహంతోనే వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయని తెలిపారు.