నర్సాపూర్, నవంబర్10: నర్సాపూర్ నియోజకవర్గం దట్టమైన అడవి గల ప్రాంతంగా పేరు గడించింది. ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా ఉండేది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంగా పదేండ్లుగా బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. నర్సాపూర్ నియోజకవర్గం మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతమే. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అధికారంలో ఉన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జరిగేది 16వ ఎన్నిక. 2000 వరకు నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట, హత్నూరతో పాటు జిన్నారం, గుమ్మడిదల మండలాలు ఉండేవి. 2000లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నియోజకవర్గం నుంచి జిన్నారం మండలాన్ని కొత్తగా ఏర్పడిన పటాన్చెరువు నియోజకవర్గంలో కలిపారు. నర్సాపూర్లోకి కొత్తగా వెల్దుర్తి, కొల్చారం మండలాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో నర్సాపూర్, కౌడిపల్లి, హత్నూర, శివ్వంపేట, కొల్చారం, వెల్దుర్తితోపాటు కొత్తగా ఏర్పడిన మాసాయిపేట, చిలిపిచెడ్ మండలాలు ఉన్నాయి. హత్నూర మండలం సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది.
నర్సాపూర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో రామిరెడ్డి కాంగ్రెస్ నుంచి మొదటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత చిలుముల విఠల్రెడ్డి సీపీఐ నుంచి 1962, 1978 ఎన్నికల్లో రెండుసార్లు, ఆ తర్వాత 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1975లో ఎన్నికల నాటికి కాంగ్రెస్ నుంచి గుండం వీరయ్య విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసిన జగన్నాథరావు 1967, 1972, 1983 ఎన్నికల్లో మూడుసార్లు గెలిచారు. కాంగ్రెస్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి 1999, 2004, 2009లో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి విఠల్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి ఇద్దరు నాయకులు మాత్రమే వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999, 2004లో టీడీపీ నుంచి మదన్రెడ్డి బరిలో నిలిచి, ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో సునీతాలక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ దిశగా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు.
నర్సాపూర్ నియోజకవర్గం ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేకతను చాటుకున్నది. శివ్వంపేట మండలం ఉమ్మడి జిల్లాలోనే ప్రముఖ ఆలయాలతో విరాజిల్లుతున్నది. మండలంలోని చిన్నగొట్టిముక్ల అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన సహకార ఆంజనేయస్వామి, సికింద్లాపూర్లో ఏడు వందల ఏండ్ల క్రితం వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ సమీపంలో ఉన్న కోనేరుకు ప్రత్యేకత ఉంది. ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. దొంతి గ్రామంలో ఐదు వందల సంవత్సరాల క్రితం దొంతి సంస్థానాధీశులు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం, శివ్వంపేటలో ఈ మధ్యనే నిర్మించిన బగళాముఖి శక్తి పీఠం ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కొల్చారం మండలంలో రాష్ట్రంలో ఎక్కడా లేని జైనమందిరం ఉండడం విశేషం. కౌడిపల్లి మండలం తునికి గ్రామ సమీపంలో నల్లపోచమ్మ ఆలయం, చిలిపిచెడ్ మండలంలో చాముండేశ్వరి ఆలయం ప్రసిద్ధి చెందాయి.
నర్సాపూర్ పేరు వినగానే మొట్టమొదటగా గుర్తుకొచ్చేది దట్టమైన అడవి ప్రాంతం. నియోజకవర్గంలోని నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట్, వెల్దుర్తి మండలాల్లో అడవి విస్తరించి ఉంది. హైదరాబాద్- మెదక్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అడవి ప్రాంతంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నర్సాపూర్ సమీపంలోని కొంత భాగంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.
మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఇక్కడే అత్యధిక ఓటర్లు ఉండడం విశేషం. మొదటి ఎన్నికల్లో 50,945 మంది ఓటర్లు ఉన్నారు. ఇక అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నారు. 1957 నుంచి 1983 వరకు జరిగిన ఏడు ఎన్నికల్లో లక్షలోపే ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో 1.50 లక్షలు దాటింది. ఇలా ప్రస్తుతం 2,20,211లకు చేరింది. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుషులు 1,07,587 మంది ఉంటే, మహిళలు 1,12,617 మంది ఉన్నారు.
1. చిలుముల మదన్రెడ్డి- టీఆర్ఎస్-1,05,665(57.54%)
2. వాకిటి సునీతారెడ్డి- కాంగ్రెస్-67,345(36.67%)
3. సింగాయిపల్లి గోపి-బీజేపీ- 2,848(1.55%)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నర్సాపూర్ నియోజకవర్గం గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎంతగానో అభివృద్ధి చెందింది. నర్సాపూర్కు తలమానికమైన అడవి ప్రాంతాన్ని గత పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అడవి ప్రాంతంలో అర్బన్ పార్క్ను ఏర్పాటు చేశారు. ఇది సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికైన బస్ డిపోను ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఏర్పాటుచేశారు. హల్దీ, మంజీరా వాగులపై 14 చెక్డ్యామ్లు నిర్మించడంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలను కలుపుతూ ఫోర్లేన్ జాతీయ రహదారిని నిర్మించారు. ప్రతి గ్రామంలో, తండాలో సీసీ, బీటీ రోడ్లు నిర్మించారు. తాగు నీటి గోషను తీర్చేలా ప్రతి గ్రామంలో ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్నారు. మిషన్ కాకతీయ పథకంలోభాగంగా చెరువుల్లో పూడికలు తీసి వాటి సామర్థ్యాన్ని పెంచారు. ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు.