మెదక్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో అప్పుడే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటికోసం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోనే భూగర్భ జలాలు అడుగంటాయి. ఇంకా పూర్తిస్థాయిలో ఎండలు పెరిగితే నీటి కటకట తీవ్రంగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది. తాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు ఏమైనా తీసుకుంటాయా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లాలో యాసంగి సీజన్లో 2,72,465 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో 2,60,933 ఎకరాల్లో వరి సాగైంది. యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచింది. మరోరెండు నెలలు పంటలను కాపాడాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు బోరు బావుల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. దీంతో పంటలు ఎండిపోతాయనే సందేహంలో రైతులు ఉన్నారు. దీనికి తోడు విద్యుత్ 18 గంటలు మాత్రమే సరఫరా అవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంట్ సరఫరా అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇలా అన్ని కారణాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ఫిబ్రవరిలోనే భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. రోజురోజుకూ తగ్గుతున్న భూగర్భ జలాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పల్లెల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాలోని 57 బావుల్లో భూగర్భ జలాల నీటి మట్టాలను సంబంధితశాఖ అధికారులు పరిశీలించారు. 2023 జనవరిలో సగటు నీటిమట్టం 10.46, 2024 జనవరిలో సగటు నీటి మట్టం 11.46గా నమోదైంది. గత ఏడాది.. ఈ ఏడాదిని పోల్చుకుని చూస్తే నీటి మట్టం 1.0 మీటర్లు మైనస్లోకి వెళ్లింది. 2023 ఫిబ్రవరిలో జిల్లా భూగర్భ జలమట్టం 12.16 మీటర్లు కాగా, 2022 ఫిబ్రవరిలో 9.69 మీటర్లుగా నమోదైంది. భూగర్భ జలాలు 2.47 మీటర్లు మైనస్లోకి వెళ్లాయి. 2023 ఫిబ్రవరి, 2024తో మండలాల వారీగా సగటు భూగర్భ జలాల స్థాయిలతో పోల్చితే జిల్లాలోని ఆయా మండలాల్లో సగటు నీటి మట్టాలు పడిపోయాయి.
మెదక్ జిల్లాలో రైతులు యాసంగిలో వరి పంట జోరుగా సాగుచేశారు. మొత్తంగా 2,72,465 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 2,60,933 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొక్కజొన్న 2490 ఎకరాలు, జొన్న 7899 ఎకరాలు, శనగలు 271, వేరుశనగ 99, మినుములు 11, ఇతర పంటలు 762 ఎకరాల్లో సాగు చేయగా అప్పుడే వరి పంటలు ఎండిపోతున్నాయి.