తనను బద్నాం చేసేందుకు రాజకీయకుట్ర జరుగుతున్నదని, దళితబంధు మంజూరు కోసం కమీషన్లు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అందోల్ మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. టేక్మాల్ పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి తనపై ఫిర్యాదు చేసిన విషయమై ఆయన స్పందించారు. ఐదేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కేవలం జీతం మాత్రమే తీసుకుని పనిచేశానని పేర్కొన్నారు. నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకూ సిద్ధమన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి రాగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నదని, అధికారులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు బెదిరింపులకు దిగుతున్నదని మండిపడ్డారు.
టేక్మాల్/మెదక్ అర్బన్, డిసెంబర్ 18: ‘బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు ప్రజలకు ప్రజారంజకంగా పరిపాలన అందించింది. దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో కమీషన్లు తీసుకున్నానని అధికార పార్టీ నాపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు.’ అని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. దళితబంధు మంజూరు కోసం తాను డబ్బులు తీసుకున్నానని టేక్మాల్ పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. టేక్మాల్ మండలంలోని పల్వంచ గ్రామానికి చెందిన పల్వంచ భూమయ్య అనే వ్యక్తి నుంచి దళితబంధు పంపిణీ కోసం తాను డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. గత ఐదేండ్లలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కేవలం జీతం తీసుకుని ప్రజల సేవ చేశానని, నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇందులో రాజకీయ కుట్ర దాగివుందని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ఆరోపణలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు లై డిటెక్టర్ పరీక్షకు కూడా తాను సిద్ధమేనన్నారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తికి కూడా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ చేస్తున్న అరాచకాలకు ఈ ఫిర్యాదు పరాకాష్ట అన్నారు. తప్పుడు కేసులతో బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, వారి ఇండ్లపై దాడులు కూడా చేస్తున్నారని మండిపడ్డారు. ఇండ్లల్లోకి చొరబడి మహిళా కార్యకర్తలపై కోడిగుడ్లతో దాడులు చేస్తున్నారని, నాయకుల ఇండ్లపై పటాకులు పేలుస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ దామోదర రాజనర్సింహ అనుచరులు రాక్షసానందం పొందుతున్నారన్నారు. గ్రామస్థాయి అధికారులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా తనను బద్నాం చేయడమే లక్ష్యంగా ప్రలోభాలకు గురిచేసి కొందరిని లోబర్చుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు.
దళిత బంధు వ్యవహారంపై తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తమ్ముడు రాహుల్ కిరణ్ సోమ వారం మెదక్ జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమను బద్నాం చేసేందుకు దామోద ర రాజనర్సింహ తన అనుచరులను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతకు ముందు టేక్మాల్ పోలీస్స్టేషన్లోనూ తమకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు.