సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 1: సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లక్ష్యం మేరకు రైస్ మిల్లర్లు ధాన్యం వెంటనే దించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులు, డీలర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు ధాన్యాన్ని దించుకోవాలన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం లారీల నుంచి ఖాళీ చేయకుండా జాప్యం చేస్తున్న మిల్లర్లపై, రవాణా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లారీల నుంచి ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాల సూపర్వైజర్లను ఆదేశించారు. హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ధాన్యం అన్లోడ్ కాగానే తిరిగి నేరుగా కొనుగోలు కేంద్రాలకే లారీలు వెళ్లాలని ఆదేశించారు. లక్ష్యం మేరకు ధాన్యాన్ని దించుకుని రోజు వారి నివేదికను మిల్లుల వద్ద ఉన్న పాయింట్ పర్సన్, డిప్యూటీ తహసీల్దార్ నుంచి రావాలని చెప్పారు. ప్రతి రైస్ మిల్లు వద్ద దశాబ్ది ఉత్సవాల ఫ్లెక్సీ, పోస్టర్ ప్రదర్శించాలన్నారు. పారిశ్రామిక దినోత్సవం నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వనజాత, డీఏం సుగుణబాయి తదితరులు పాల్గొన్నారు.