సిద్దిపేట, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లా అభివృద్ధి, సంక్షేమం మంత్రులకు పట్టదా..? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటుతున్నా కనీసం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు. జిల్లాలో ఏం జరుగుతున్నది.? సమస్యలు ఏం ఉన్నాయి…? వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగు, సాగునీటి పరిస్థితి ఏమిటి? రైతుబంధు ఎంతమందికి వచ్చింది? ఇంటర్, పదోతరగతి పరీక్షల నిర్వహణ, కరెంట్ సరఫరా తీరు.. ఇలా ఎన్నో అంశాలపై రివ్యూ మీటింగ్లు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన మంత్రులు ముఖం చాటేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు మంజూరు చేసిన నిధులు వెనక్కిపోవడంతో పనులు మధ్యలో ఆగిపోయాయి. వాటి పరిస్థితి ఏమిటి..? ఇవన్నింటినీ ఎలా పరిష్కరించాలి..? కనీసం జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రుల సూచనలు కూడా లేవు. అసలు ప్రభుత్వం ఉందా..? పాలన నడుస్తున్నదా..? అనే విధంగా జిల్లాలో నిర్లిప్తత నెలకొంది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి కొంతమేర దిశానిర్దేశం చేస్తున్నారు.
సిద్దిపేట, మెదక్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదు. సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఎంతసేపు ఆయన కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలకే పరిమితమవుతున్నారనే అపవాదు ఉంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఒక్కసారి సిద్దిపేట కలెక్టరేట్లో అధికారులతో పరిచయ సమావేశం తప్ప మరో సమావేశం ఆయన నిర్వహించలేదు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సమయంలో సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశంలో మాత్రమే ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె జిల్లాకు రాలేదు. సమస్యలు పరిష్కరించడం, అభివృద్ధికి కృషిచేయాల్సిన మంత్రులే ఇలా ఉంటే పాలన ఎలా ఉం టుందో అర్థం చేసుకోవచ్చు. మరో పది పదిహేను రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ వస్తే అన్ని పనులు ఆగిపోయే అవకాశం ఉంది.
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మార్చి 7కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుంది. కానీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమీక్షా సమావేశాలు నిర్వహించి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయకపోవడంతో పాలన పడకేసింది. సమస్యలు పరిష్కారం కాకపోవడం, అభివృద్ధి పనులు కుంటుపడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగి రైతుబంధు డబ్బులు ఇంకా పూర్తిస్థాయిలో రైతులకు అందలేదు. రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగుచేసుకున్నారు. ఆసరా పింఛన్లు సరిగ్గా ఇవ్వడపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దవాఖానలు, మున్సిపాలిటీలు, పలు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందక ఆందోళన చేస్తున్నారు.
గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నా సంబంధిత అధికారుల చర్యలు కరువయ్యాయి. పాన్డబ్బాలు, కిరాణా, జనరల్ స్టోర్స్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. వీటికి యువత బానిసలవుతున్నారు. ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. అరికట్టాల్సిన వారే వారికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. అధికారులు సమస్యలపై దృష్టిసారించడం లేదని, చుట్టపు చూపుగా గ్రామాలకు వచ్చి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి, నర్సరీల్లో మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇలా ఎన్నో సమస్యలు జిల్లాలో నెలకొన్నాయి. అసలు పాలన ఉందా? ప్రభుత్వం నడుస్తున్నదా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇప్పటికైనా జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రి సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
అనధికార కరెంట్ కోతలు ఇప్పుడే రైతులకు ఇబ్బందులను గురిచేస్తున్నాయి. తరుచూ కరెంట్ ట్రిప్తో మోటర్లు కాలుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వల ద్వారా గోదావరి జలాలు పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి పోతుండడంతో పంటలను కాపాడుకోవడానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. పదేండ్లలో ఎన్నడూ తాగునీటి సమస్యలపై ధర్నాలు, ఆందోళనలు జరగలేదు.ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారులో ఆ పరిస్థితి నెలకొంది. వారం రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. మార్చిలో పదోతరగతి పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ, సన్నద్ధతపై మంత్రులు కనీసం సమీక్ష చేయలేదు. జిల్లాలో విద్యాశాఖ సైతం పూర్తి నిర్లిప్తతగా ఉంది. విద్యార్థులకు స్నాక్స్ సరిగా అందడం లేదు.