రామాయంపేట, జూలై 23: అంతర పంటలు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వం సంబంధిత అధికారులు యాసంగిలో ఆరుతడి, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్కు చెందిన రైతు పెద్దొల్ల రాములు తనకున్న కొద్దిపాటి వ్యవసాయ పొలంలో ఉల్లి పంటను వేశాడు. 90 రోజుల్లో చేతికి వచ్చే ఉల్లిపంటతో పాటు పాడి పశువుల మేత కోసం గడ్డి విత్తనాలను తీసుకొచ్చి గుంట భూమిలో విత్తుకుని రోజూ గడ్డిని తీసుకుని, తనకున్న నాలుగు బర్లను పోశిస్తున్నాడు.
గతంలో సైతం రైతు ఆరుతడి పంటలైన కూరగాయలు టమాట, పాలకూర తదితర కూరగాయల పంటలు విత్తుకుని, తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పంట దిగుబడి చేతికి రాగానే అదే భూమిలో ఇతర పంటలు వేసి మంచి దిగుబడిని సాధిస్తున్నాడు. ఉల్లి పంటకు మార్కెట్లో భలే గిరాకీ ఉందని, అందుకోసమే ఉల్లి పంటను వేసుకున్నట్లు రైతు తెలిపాడు. పంటను కాపాడుకోవడానికి ఉల్లి చేనులో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశాడు. దాంతో పాటు రాత్రిపూట చేనుకు వచ్చి డబ్బాలతో చప్పుడు చేస్తే అడవి జంతువులు పంట చేనులోకి రావనే ఉద్దేశంతో చుట్టూరా జాలీలు ఏర్పాటు చేశాడు.
2 టన్నుల ఉల్లిగడ్డ పండిస్తా..
నేను వేసుకున్న 20 గుంటల భూమిలో ఉల్లి సాగు చేస్తున్నాను. అందులో దాదాపు 2 టన్నుల వరకు దిగుబడి తీస్తాను. ఉల్లి పంటకు మార్కెట్లో విక్రయాలు కూడా బాగుంటాయి. ప్రతి యాసంగిలో ఏదో ఒకరకమైన కూరగాయలు, ఇతర పంటలను వేస్తాను. ఇప్పటివరకు అంతర పంటలు వేసి ఎప్పుడూ కూడా నష్టపోలేదు. మార్కెట్లో ఉన్న పంటలనే తాను విత్తుకుంటా. ప్రభుత్వం, అధికారులు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించడం సంతోషంగా ఉంది.
– రైతు పెద్దొల్ల రాములు