మెదక్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాల వారీగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కలెక్టర్లకు సూచించారు. బుధవారం సాయంత్రం ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో మెదక్ కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్లు రమే శ్, వెంకటేశ్వర్లు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ పాల్గొన్నారు. పంటనష్టం ఆస్తినష్టం వివరాలను క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని తెలిపారు. అనంత రం కలెక్టర్ రాజర్షిషా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాతావరణశాఖ హెచ్చరికల ప్రకారం.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మెదక్టౌన్ వాటర్ డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలని వర్షాకాలంలో డ్రైనేజీలో ఎటువంటి అడ్డంకులు లేకుండా నీరు సాఫీగా సాగేటట్టు డ్రైనేజీ పనులు జరుగాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులు, మండలస్థాయి అధికారులు, సిబ్బంది హెడ్క్వార్టర్ లో ఉండాలన్నారు. ప్రజల అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నం. 93919422 54, సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉంటారన్నారు. కరెంటు సమస్యల పరిషారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నం. 7901677782కు ఫోన్ చేయాలని ఎలక్ట్రికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
సంగారెడ్డి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో వ్యవసాయ, పంచాయతీ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా దెబ్బతిన్న పంటల విషయంలో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు తగిన సూచనలు, సలహాలు చేయాలన్నారు. చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎడతెరిపి లేని వర్షాల ద్వారా ఇప్పటివరకు ఎన్ని చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకున్నాయని పరిశీలించాలన్నారు. వాగులు, కాల్వల పరిస్థితులను అన్ని గ్రామ పంచాయతీల్లో చక్కదిద్దాలన్నారు. వర్షాలతో జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా, అప్రమత్తతో కూడిన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పురాతన, తడిసిన గోడలు, కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. ఏఎన్ఎంలు, ఆశలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్వో నగేశ్, ఆర్అండ్బీ, నీటి పారుదల, విద్యుత్శాఖల ఎస్ఈలు, పంచాయతీరాజ్ ఈఈ, డీపీవో, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.