హుస్నాబాద్ టౌన్, మార్చి 16: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తిచేసి కాల్వల ద్వారా సాగునీరు వస్తే పంటలు పండుతాయనే ఆశలు రైతుల్లో రోజురోజుకు ఆవిరైపోతున్నాయి. గెలిచిన వెంటనే గౌరవెల్లి రిజర్వాయర్, కాల్వల పనులను పూర్తిచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కానీ, ఆచరణలో అమలు కావడం లేదు. దీంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు వేలాది రూపాయల పెట్టుబడులుపెట్టి ఏటా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు అడుగంటుతున్న భూగర్భ జలాలు హుస్నాబాద్ ప్రాంత రైతన్నల ఆశలను ఆవిరి చేస్తున్నాయి.
వానకాలంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో వర్షాలు సమృద్ధ్దిగా కురిసినప్పటికీ బోరుబావుల్లో నీరు మార్చి నాటికే అడుగంటిపోతున్నాయి. ఎండలు ముదురక ముందే సాగునీరు అడుగంటి పోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ముప్పై గజాలు ఉన్న బావుల్లో గంట కూడా నీళ్లు రావడం లేదు. దీంతో రైతులు బావుల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. చేతికొచ్చిన పంట ఎక్కడ ఎండిపోతుందోనని నీళ్లకోసం రైతులు బావుల్లో పూడిక తీయిస్తున్నారు. దీని కోసం రైతులు వేలాది రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తున్నది. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయి, కాల్వల నిర్మాణం చేపట్టి సాగునీరిస్తే దర్జాగా పంటలు పండించుకుంటామని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాలి.
నాకున్న రెండున్నర ఎకరాల భూమిలో రెండెకరాల్లో వరి సాగుచేశా. ఇరవై గజాల బావి ఉన్నది. నాటేసినప్పుడు బావిలో మంచిగనే నీళ్లు ఎల్లినవి. ఇప్పుడు వరి అంత ఈనుతున్నది. పావుగంటకంటే ఒక్క చుక్కనీరు ఎల్లుతలేదు. కాల్వలు కడితే మా బావులు ఎండిపోకపోతుండే. ఉన్న కుమ్మరికుంటను కొందరు చెడగొట్టిండ్రు. ఈ విషయం మంత్రికి, ఇరిగేషన్ అధికారులకు చెప్పిన ఎవ్వలు పట్టించుకోలే. ఇప్పుడు చేతికొచ్చిన పంటంతా నాశనమైపోయింది. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి ఎట్లకట్టాలే అర్థమైతలేదు. మంత్రిపొన్నం ప్రభాకర్గౌడ్ ఇప్పటికైనా మా రైతుల గోడు పట్టించుకోని మా కట్టాలు తెల్లారేతట్టుసెయ్యాలని మొక్కుతున్న.
– గొర్ల కొమురయ్య, రైతు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)