రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. గురువారం నుంచి పంట రుణాల మాఫీ ప్రక్రియ చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని బుధవారం ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగలా మార్చింది. స్వరాష్ట్రంలో రైతు రాత మారింది. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి, రైతుబీమా, నాణ్యమైన విద్యుత్ సరఫరా, గ్రామాల్లోనే పంట కొనుగోళ్లు, రైతుల కల్లాలు.. ఇలా అనేక విధాలుగా అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ చేయూతతో రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తూ తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రెండు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీని పూర్తిచేసింది. ప్రస్తుతం లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ కానున్నాయి.
సిద్దిపేట, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్పారు. గురువారం (నేటి) నుంచి రుణమాఫీ ప్రక్రియను చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల పంట రుణాలు మాఫీ కానున్నాయి. అర్హత పొందిన ప్రతి రైతుకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తున్నది. రైతు విత్తనం నాటి నుంచి పంట చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నది. సీఎం కేసీఆర్ రైతన్నలకు దన్నుగా నిలవడంతో వారంతా ఖుషీ ఖుషీగా ఎవుసం చేసుకుంటున్నారు. సకాలంలో ఎరువులు విత్తనాలు, పంట పెట్టుబడి, నాణ్యమైన విద్యుత్, పంట కొనుగోళ్లు, రైతుల కల్లాలు ఇలా ఒకటేమిటి రైతుల అవసరాల మేరకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది.
నేటి నుంచి రుణమాఫీ
సీఎం కేసీఆర్ రుణమాఫీపై నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి శాసనసభ బడ్జెట్లో రుణమాఫీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. అర్హత కలిగిన రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తారు. ఇట్టి రుణమాఫీని నేటి నుంచి చేపట్టనున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంత మందికి రుణమాఫీ కానున్నదన్న విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే లెక్కలు తీశారు. ఆ లెక్కుల ప్రకారం సిద్దిపేట జిల్లాలో 1,67,771 మంది రైతులు అర్హులు కాగా ఇప్పటి వరకు రూ. 25వేలలోపు రుణం పొందిన వారు 20,146 మంది రైతులకు రూ. 27.14 కోట్లు, రూ.50వేలలోపు రుణం పొందిన 24,600 మంది రైతులకు రూ.87.0 కోట్లు మాఫీ చేసింది. మిగతా రూ.లక్ష రూపాయలు తీసుకున్న అర్హులైన వారికి రుణం పూర్తిగా మాఫీ కానున్నది. మెదక్ జిల్లాలో రుణమాఫీకి 1,53,883 మంది అర్హులు కాగా వీరిలో ఇప్పటి వరకు 25వేల లోపు వారు 22,097మంది రైతులకు రూ.34.12 కోట్లు, రూ. 50 వేలలోపు ఉన్న 24,200 మందికి రూ. 85.0 కోట్లు మాఫీ చేసింది. మిగిలిన వారికి మాఫీ కానున్నది. సంగారెడ్డి జిల్లాలో 1,90.002 మంది రైతులు అర్హులు కాగా ఇప్పటి వరకు రూ. 25 వేలు మాఫీ అయిన వారు 20,503 మంది రైతులకు రూ. 30.53 కోట్లు, రూ. 50వేల వరకు 24,765 మంది రైతులకు రూ. 89.2 కోట్లు మాఫీ చేశారు. 11 విడతలుగా రైతులకు పెట్టుబడి సాయం అందించారు.
మారిన రైతుల ముఖ చిత్రం
తెలంగాణ రాష్ట్రం వచ్చిన రైతులకు తిప్పలు తప్పాయి. పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురు చూడకుండా విత్తు విత్తక ముందే సీఎం కేసీఆర్ పెట్టు బడిసాయాన్ని అందిస్తున్నారు. ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేలు అందించి అన్నదాతకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. సాగు ప్రారంభం కాగానే ఒక గుంట భూమి ఉన్న రైతును మొదలు కొని పట్టా భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. దీంతో రైతులు సంబురంగా ఎవుసం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పంట పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు, దున్నకం చేసుకుంటున్నారు. ధాన్యం దిగుబడి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళ్లి మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. అప్పులు తెచ్చుకొని పంట పండించిన రైతులు ఇవ్వాళ రైతుబంధు రావడంతో సంతోషంగా ఉన్నారు. రైతుల జేబులో నాలుగు రూపాయలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు వచ్చి పంట రుణాలు ఇస్తున్నారు. ఒకప్పుడు ఎకరానికి రూ. 20 వేల పంట రుణం ఇచ్చిన వాళ్లు ఇప్పుడు ఎకరానికి రూ. 50 వేలకు పైగా పంట రుణాలు ఇస్తున్నారు. రైతులపై బ్యాంకులకు నమ్మకం పెరిగింది. గ్రామాల్లోనే చిన్న చిన్న బ్యాంకులు ఏర్పాటు చేసి అరగంటలో పంటరుణాలు ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. పంటల సాగు విధానంలో ఆధునిక పద్దతులు తెలియజేయడానికి ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక నిర్మించారు. ఈ వేదికలో రైతలు సమావేశమై పంటల సాగు, మార్కెట్ విధానం తదితర అంశాలపై చర్చించుకుంటున్నారు. ఇలా ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో రైతులు పండుగలా ఎవుసం చేసుకుంటున్నారు.
రైతుల వెన్నంటి ఉన్న నాయకుడు..
దేశంలోనే రైతుల కోసం ఆలోచన చేసే నాయకుడే లేడు. కేవలం ఒక్క కేసీఆర్ సారే రైతులకు వెన్నంటి ఉండి, అనునిత్యం మా కోసం ఆలోచించే నాయకుడు. రైతులకు రుణమాఫీ ప్రకటించడంపై కొంత జాప్యం జరిగినా న్యాయం చేస్తున్నడు. ఆయన మంచిగుంటే రైతులంతా బాగుంటరు. ఆయన ఎల్ల్లకాలం చల్లగుండాలె.
– సార్గు సత్యనారాయణ, రాయిలాపూర్, రామాయంపేట
రైతుల బాధ కేసీఆర్కే సారుకే ఎరుక
వ్యవసాయం చేసే రైతులకు ఎంత బాధ ఉంటుందో కేసీఆర్ సారుకే తెలుసు. అందుకే రుణమాఫీ కోసం తనదైన శైలిలో నిర్ణయం తీసుకున్నడు. సీఎం సార్ను ఎవ్వరు కూడా మరచిపోరు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తన ఆలోచనతో రైతులకు మంచి చేస్తున్నడు.
– బుచ్చ మల్లయ్య, నందిగామ, రామాయంపేట
రైతులపై సీఎం కేసీఆర్కు అపారమైన ప్రేమ
సాగు కోసం స్థానికంగా ఉన్న పీఏసీఎస్ కేంద్రాలు, బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ ప్రకటన వరంగా మారింది. సీఎం కేసీఆర్ చేసిన రుణమాఫీ ప్రకటనతో తెలంగాణలోని నాలాంటి ఎంతోమంది రైతులు ఆనందపడుతున్నారు. రైతులు ఎవుసం చేస్తూ బాగుపడాలని 24 గంటల కరెంట్ అందిస్తూ, సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో తెలంగాణ ప్రభుత్వం ఉంచుతున్నది. రైతు బంధు, రుణమాఫీ ఇలా అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ రైతులపై అపారమైన ప్రేమ చూపుతున్నారు.
– చౌదరిపల్లి తిర్మలయ్య, రైతు, నిజాంపేట
పేదల కష్టాలు తీరుస్తున్నడు
పేద రైతుల బాగు కోసం నిత్యం ఆలోచన చేస్తున్నది ఒక్క కేసీఆర్ సారే. బ్యాంకుల్లో అప్పులున్న రైతుల బాకీలను ప్రభుత్వమే కడ్తున్నదని చెప్పిన సార్కు కృతజ్ఞతలు. అప్పటికప్పుడే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఆదేశాలిచ్చిన పెద్ద కొడుకు కేసీఆరు. ఆయన చాలాకాలం సల్లంగ ఉంటే మాలాంటి పేద రైతులు మంచిగుంటరు.
– లంబాడీ సుగుణ, గిరిజన తండా, రామాయంపేట
ఆలస్యమైనా సరైన నిర్ణయం
సీఎం కేసీఆర్ సార్ ఆలోచనా సరళి బాగున్నది. రైతులకు రుణమాఫీ విషయంలో ఆలస్యమైనా రైతుల కోసం ఆలోచించి ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. దీనికి అధికారులు, ఆర్థిక శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేయడం మంచి పరిణామం. సీఎం కేసీఆర్ను రైతులెవరూ మరచిపోరు.
– అశోక్రెడ్డి, కోనాపూర్, రామాయంపేట
రైతులకు మేలు చేసేది సీఎం కేసీఆరే..
ఎప్పుడైనా రైతుల మేలు కోరేది సీఎం కేసీఆర్ సారే. రైతుల గురించి ఓ రైతుగా ఆలోచించి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జా రీ చేయడం మంచి ఆలోచన. ఇంత మంచి ఆలోచన చేసిన సీఎం కేసీఆర్కు తెలంగాణలోని రైతులంతా రుణపడి ఉంటారు.
– నర్సింహులు, ఆర్.వెంకటాపూర్, రామాయంపేట
ఇచ్చిన మాట నిలుపుకొన్న సీఎం
రైతులకు రుణమాఫీ చేస్తా అని మేనిఫెస్టోలో చెప్పారు. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయడానికి ఆదేశాలిచ్చారు. రెండేండ్లు ఆర్థిక సంక్షోభం వచ్చినా రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రుణమాఫీ చేస్తున్నారు. ఎల్లప్పుడు కేసీఆర్ రైతుల పక్షపాతి. – ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం
రాయికోడ్ మండల అధ్యక్షుడు