పాల్వంచ/ ఎర్రుపాలెం/ తల్లాడ/ సత్తుపల్లి టౌన్, మే 18 : పెంచిన ఇంధన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసనలు, మోదీ దిష్టిబొమ్మ దహనాలు చేశారు. పాల్వంచ నటరాజ్ సెంటర్లో ద్విచక్ర వాహనాలకు తాడు కట్టి లాగుతూ ఎన్డీ నాయకులు నిరసన తెలిపారు. ఎర్రుపాలెం రింగ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తల్లాడలో సీపీఎం ఆధ్వర్యంలో ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన చేపట్టారు.
సత్తుపల్లి రింగ్ సెంటర్లో సీపీఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్డీ పాల్వంచ పట్టణ కార్యదర్శి మంకెన వెంకటేశ్వర్లు, సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్రావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దండు ఆదినారాయణ, సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడారు. ప్రపంచ యుద్ధాలను సాకుగా చూపుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం సరికాదన్నారు. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తి కాగానే ప్రజలపై ధరల భారం మోపడం సరికాదని, ధరల బాదుడు వల్ల ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మల్లేశ్, వెంకటేశ్వర్లు, సంపత్, మహేశ్, నరేశ్, రాజేశ్, రమణ, నాగరాజు, నాగేశ్వరరావు, గామాసు జోగయ్య, అంగోతు వెంకటేశ్వర్లు, షేక్ కరీం, గోధుమ వెంకటేశ్వర్లు, నాగులవంచ వెంకట్రామయ్య, షేక్ లాలా, తడికమళ్ల యోగు, పాలకుర్తి వీరయ్య, కోలేటి వెంకటేశ్వరరావు, చెరుకు కేశవరావు, ఎస్కే లాల్ మహ్మద్, అయినాల రామలింగేశ్వరరావు, నల్లమోతు మోహన్రావు, రాజబోయిన సైదులు పాల్గొన్నారు.