అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయి. గురువారం పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఓట్ల లెక్కింపు ఉండడంతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ను రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని, ముందుగా 8,400 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నట్లు కలెక్టర్, సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి శరత్ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గానికి 16నుంచి 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లు మాత్రమే ఉండడంతో నారాయణఖేడ్ ఫలితం ముందుగా వెల్లడయ్యే అవకాశం ఉన్నది. అభ్యర్థులతోపాటు పోలింగ్ కేంద్రాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పటాన్చెరు ఫలితం ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ కోసం పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రాన్ని సీసీ కెమెరాల్లో పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో గీతం యూనివర్సిటీ పరిసరాలతోపాటు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 500 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడనున్నది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కించనున్నారు. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉయదం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గీతం యూనివర్సిటీల్లో జరగనుంది. ఓట్లు లెక్కించేందుకు యూనివర్సిటీలో ఐదు హాళ్లను సిద్ధ్దం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల అధికారులతో సమావేశమై కౌంటింగ్కు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ రూపేశ్ పోలీసు అధికారులతో కలిసి గీతం యూనివర్సిటీలో బందోబస్తు ఏ ర్పాట్లను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లాలో గత నెల 30వతేదీన ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 13,93,711 మంది ఓటర్లకుగాను 10,73,014 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 76.99 శాతం పోలింగ్ నమోదైంది. నారాయణఖేడ్ అసెంబ్లీలో 192418 మంది ఓట్లు వేశారు. అందోలు నియోజకవర్గంలో 211364 మంది, జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలో 207748 మంది, సంగారెడ్డి అసెంబ్లీలో 184974, పటాన్చెరులో 276510 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 30న పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారులు ఈవీఎంలను పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన, స్ట్రాం గ్రూమ్లకు తరలించారు. నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్ల్లో బందోబస్తు మధ్య భద్రపర్చారు.
సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఇందుకోసం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల ఓట్లను లెక్కించేందుకు గీతం యూనివర్సిటీలో ఐదు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్లు లెక్కించేందుకు వీలుగా టేబుళ్లు వేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కంట్రల్ యూనిట్లు, వీవీప్యాట్లను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకు వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్లు లెక్కించేందుకు నియోజకవర్గాల వారీగా ఒక్కో హాల్లో 16 నుంచి 18 టేబళ్లు వేశా రు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఓట్లను లెక్కిస్తారు. ఆర్వోతోపాటు ఏఆర్వో, సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. కంట్రోల్ యూనిట్ ద్వారా ఓట్లు లెక్కించిన అనంతరం వాటిని ఆర్వోకు తెలియజేస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల కమిషన్కు సమాచారం అందజేస్తారు. ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు మైకు ద్వారా వివరిస్తారు. ఎన్నికల అధికారులు ప్రజలు ఎన్నికల ఫలితాలు తెలుసుకునేందుకు వీలుగా కౌంటింగ్ కేంద్రం ఆవరణలో డిజిటల్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఐదు నియోజకవర్గాల్లో పోస్టల బ్యాలెట్ ద్వారా 8400 ఓట్లు పోలయ్యాయి. వీటిని మొదట నియోజకవర్గాల వారీగా లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలో పొలైన ఓట్లను కౌంటింగ్ సిబ్బంది కౌంట్ చేయడం ప్రారంభిస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఓట్లు లెక్కించేందుకు 16 నుంచి 18 టేబుళ్లు వేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి 17 నుంచి 23 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికారుల సమాచారం మేరకు మొదటగా నారాయణఖేడ్ నియోజకవర్గం ఎన్నికల ఫలితం వెలువడే అవకాశం ఉన్నది. నారాయణఖేడ్ నియోజకవర్గం లో పోటీచేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతోపాటు 17 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడికానున్నాయి. 11 గంటల వరకు నారాయణఖేడ్ నియోజకవర్గం ఫలితం వెలువడే అవకాశం ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు, పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువ గా ఉన్నందున చివరగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కం ఠ నెలకొన్నది. రాజకీయవర్గాలతోపాటు ప్రజలు సైతం అసెం బ్లీ ఫలితాలు ఎంటా ఉంటాయోనని ఎదురుచూస్తున్నారు. ఈ నెల 30వ తేదీన జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక లు జరిగాయి. బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్(సంగారెడ్డి), క్రాంతికిరణ్(అందోలు), భూపాల్రెడ్డి(నారాయణఖేడ్), మ హిపాల్రెడ్డి(పటాన్చెరు), మాణిక్రావు(జహీరాబాద్) ఎన్నికల్లో పోటీ చేశారు. వీరితోపాటు ఐదు నియోజకవర్గాల్లో 102 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా ఓటరు ఎలాంటి తీర్పు ఇచ్చారోనని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నా రు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను తమను విజయతీరాలకు చేరుస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థులు నమ్మం గా ఉన్నారు. ఓటింగ్ సరళిని విశ్లేషించిన బీఆర్ఎస్ అభ్యర్థులు పార్టీ శ్రేణులు కంగారుపడవద్దని తప్పకుండా గెలుస్తామన్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉత్కంఠతో ఉన్నారు.