గజ్వేల్, నవంబర్ 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీరనినష్టం జరుగుతున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పిడిచేడ్ సమీపంలోని జిన్నింగ్ మిల్లును ఆయన సందర్శించి, అక్కడి రైతులతో మాట్లాడి పత్తి కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 40వేల ఎకరాల్లో పత్తి సాగుచేసినట్లు తెలిపారు.
పంట సాగు సమయంలో ఎరువులు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడిన రైతులను, అధిక వర్షాలు ఎంతగానో నష్టం చేశాయన్నారు. ప్రస్తుతం పండించిన పత్తిని అమ్ముకుందామంటే సీసీఐ కొనుగోలు కేంద్రా ల్లో తేమశాతం పేరుతో మరింతగా నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ఆన్లైన్లో ముందు గా బుకింగ్ చేసుకొని అమ్ముకోవాలనే నిబంధనతో రైతు లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. పరిమితులు విధించకుండా రైతుల నుంచి మొత్తం పత్తి కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రింగ్రోడ్డు పక్కన నిర్మించిన కాటన్ మార్కెట్లో పత్తి కొనుగోలు చేయకుంటే మార్కెట్ ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో గజ్వేల్ మార్కెట్ను బలోపేతమైందని, ఆ నిధులతో నేడు కూరగాయల మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, నవాజ్మీరా, నాయకులు జకీయొద్దీన్, దయాకర్రెడ్డి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.