కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. దశాబ్దాలుగా ఒప్పందం ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తూ నూతన సచివాలయం ప్రారంభోత్సవం రోజు ఫైలుపై సంతకం చేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. వలస పాలనలో చాలీచాలని వేతనాలు, వెట్టిచాకిరీతో ఇబ్బందులు పడ్డ అధ్యాపకులకు బీఆర్ఎస్ సర్కారు వచ్చాక పలుమార్లు వేతనాలు పెంచి అండగా నిలబడింది. తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నప్పుడే క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 2016 ఫిబ్రవరి 26న ఇందుకు సంబంధించి జీవో 16 జారీ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఎట్టకేలకు గత డిసెంబర్లో హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 502 మందిని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం జీవో 38ని విడుదల చేసింది.
– మెదక్ మున్సిపాలిటీ/ సంగారెడ్డి కలెక్టరేట్, మే 1 వేతనాల పెంపు ఇలా..
ప్రభుత్వ అధ్యాపకులతో సమానంగా కాంట్రాక్టు అధ్యాపకులకు సర్కారు వేతనాలు పెంచింది. 2001-02లో రూ.7,500 వేతనంతో ప్రారంభం కాగా, 2011జూన్ నుంచి రూ.18 వేలుగా నిర్ణయించారు. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత జనవరి 2017 నుంచి రూ.27 వేలకు పెంచారు. జూన్ 2017 నుంచి రూ.37,100 చెల్లిస్తుండగా.. జూన్ 2021 నుంచి రూ. 54,220 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రెగ్యులరైజ్ చేయడంతో ఇక నుంచి ప్రభుత్వ అధ్యాపకులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. కాంట్రాక్ట్ అధ్యాపకుల గౌరవాన్ని నిలబెడుతూ సీఎం కేసీఆర్ ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మెదక్ మున్సిపాలిటీ, మే 1: కాంట్రాక్టు అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సమైక్య పాలనలో చాలీచాలని వేతనాలు, వెట్టిచాకిరితో అరిగోస పడ్డ కాంట్రాక్టు అధ్యాపకుల దశాబ్దాల కల నెరవేరింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా క్రమబద్ధీకరణ ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో ప్రభుత్వం జీవో 38ని జారీ చేసింది. సచివాలయ వేదికగా తమ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒప్పంద అధ్యాపకులు ఆనందంలో మునిగి తేలారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జూనియర్ కళాశాల అధ్యాపకులు 399 మంది, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు 96 మంది, డిగ్రీ కాలేజీ అధ్యాపకులు ఏడుగురు రెగ్యులరైజ్ కానుండటంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సార్కు జీవితాంతం రుణపడి ఉంటామని ముక్తకంఠంతో చెబుతున్నారు.
మాట నిలబెట్టుకున్న సీఎం..
బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. సీమాంధ్ర పాలకులు సరిపడా వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఉద్యమ నేతగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఆనాడే హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 2016 ఫిబ్రవరి 26న జీవో 16 జారీ చేశారు. ఇదిగిట్టని ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అనంతరం కేసీఆర్ 2017లో సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేస్తూ బేసిక్ పే కల్పించారు. ఇంతటితో ఆగకుండా 2021లో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత డిసెంబర్లో క్రమబద్ధీకరణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అవరోదాలు తొలిగిపోయాయి. ఈ క్రమంలో నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరణ ఫైళ్లపై సంతకం చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 578 మంది కాంట్రాక్టు లెక్చరర్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 15, జూనియర్ 56, పాలిటెక్నిక్ 12 కళాశాలలున్నాయి. డిగ్రీ కళాశాలల్లో 83 మంది, జూనియర్ కళాశాలల్లో 399 (మెదక్ జిల్లాలో 125, సంగారెడ్డి జిల్లాలో 127, సిద్దిపేట జిల్లాలో 147 మంది), పాలిటెక్నిక్ కళాశాలల్లో 96 మంది ఒప్పంద లెక్చరర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 399 మంది జూనియర్ కళాశాలల అధ్యాపకులు, ఏడుగురు డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, 96 మంది పాలిటెక్నిక్ అధ్యాపకులు రెగ్యులరైజ్ అయ్యారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం
కాంట్రాక్టు అధ్యాపకులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో సోమవారం మెదక్లోని రాందాస్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్యోగులు అన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు శ్రీనివాస్, పవన్కుమార్, ఫర్జానా జబీన్, మల్లయ్య, స్వర్ణలత, జ్యోతి, వసంత, శ్రీలత, సంతోశ్, రమేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
జీవితాల్లో వెలుగులు నిండాయి
మా కష్టాలను అర్థం చేసుకొని క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో మా జీవితాల్లో వెలుగులు నింపినట్లు అయ్యింది. భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వ విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం.
– ఫర్జానా జబీన్,
జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ బాధ్యతతో పని చేస్తాం..
కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న మా ఉద్యోగానికి ఎప్పుడు ఏమవుతుందోనని అనే అందోళన వెంటాడేది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మాకు భరోసా వచ్చింది. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం గతంలోనే ప్రకటించారు. కానీ కొంత మంది కోర్టుకు వెళ్లడంతో కాస్త ఆలస్యమైంది. ఎట్టకేలకు రెగ్యులరైజ్ చేయడం మాతో పాటు మా కుటుంబాలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మున్ముందు మరింత బాధ్యతో పనిచేస్తాం. కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– గాండ్ల శ్రీనివాస్, మెదక్ జిల్లా సీజేఐ అసోసియేషన్ ప్రెసిడెంట్
కేసీఆర్కు అండగా ఉంటాం..
కాంట్రాక్ట్ అధ్యాపకుల బానిస సంకెళ్లను సీఎం కేసీఆర్ ప్రభుత్వం బద్దలు కొట్టింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా క్రమబద్ధీకరణ ఫైళ్లపై సంతకం పెట్టడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తెలంగాణ వస్తే ఏమొస్తదని విమర్శించే వారికి ఇదే సమాధానం. దేశంలో ఎక్కడాలేని విధంగా రెగ్యులరైజ్ చేస్తున్న సీఎం సార్కు అన్నివేళలా అండగా ఉంటాం.
– పవన్కుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకుడు