– మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 20 : మన ఊరు-మనబడి కార్యక్రమంలో రూ.30 లక్షల లోపు నిధులతో చేపట్టే పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిధుల కొరత లేదని, చేసిన పనులకు సంబంధించిన ఎంబీ రికార్డు చేసి ఎఫ్టీవో పోర్టల్లో నమోదు చేసి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలన్నారు. వానకాలం నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ.30 లక్షల నుంచి రూ.కోటి లోపు పనులకు టెండర్లు రాని ప్రాంతాల్లో పాఠశాల నిర్వహణ కమిటీలో తీర్మానించి నామినేషన్ పద్ధతిన వెంటనే పనులు చేపట్టాలన్నారు.
రూ.కోటి పైగా పనులకు టెండర్లు రాని వాటికి సంబంధిత శాసన సభ్యుల సహకారంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేలా చూడాలని సూచించారు. శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులు, ఎస్ఎమ్సీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, మండల నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి, చేపట్టాల్సిన పనులు, వాటి అంచనా, కాలవ్యవధి వివరాలు తెలిపి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. సర్పంచులు ముందుకు రాని పక్షంలో తమ వద్ద ఉన్న కాంట్రాక్టర్ల ద్వారా వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. అదనపు తరగతి గదులు మంజూరైన పాఠశాలలో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిర్మాణాలు పూర్తైన వాటికి, రంగులు వేసిన వాటికి ఏంబీ రికార్డు చేయాలన్నారు. సమావేశంలో డీఈవో రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పీఆర్ ఈఈ సత్యనారాయణరెడ్డి, నీటి పారుదల ఈఈ శ్రీనివాస్రావు, డీఈఈలు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.