మహిళా సమాఖ్యలకు సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ గొప్ప అవకాశం కల్పించారు. జిల్లాలోని 11ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొత్తగా నిర్మించనున్న 34 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణాలను సమాఖ్యలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఒక్కో భవనానికి రూ. 20లక్షల చొప్పున మొత్తం రూ.6.80కోట్లు మంజూరు చేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించింది. ఈ నిధులను సమాఖ్యలకు కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్లు, వైద్యాధికారుల ఆధ్వర్యంలో స్థలాలు ఎంపిక పూర్తవగానే, పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేడు కంది మండలం ఫసల్వాది సబ్ సెంటర్ భవనానికి టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ భూమిపూజ చేయనున్నారు.
– సంగారెడ్డి, జూలై 7
సంగారెడ్డి, జులై 7: సమాజాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విజయవంతం చేస్తున్న మహిళలకు అధికారులు మరో అవకాశం కల్పించారు. భవన నిర్మాణరంగంలో బాధ్యతలు అప్పగించారు. భవన నిర్మాణంలో అతివలు రాణిస్తే ఆర్థికాభివృద్ధికి ఢోకా ఉండదని పలువురు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. జిల్లాలోని మండల మహిళా సమాఖ్యలకు ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణ పనుల బాధ్యతలు అప్పగించారు.
11 పీహెచ్సీల పరిధిలో నిర్మాణాలు
సంగారెడ్డి జిల్లాలోని 11ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 34 ఆరోగ్య ఉప కేంద్రాల కొత్త భవనాలకు ప్రభుత్వం రూ.6.80కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించారు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి జిల్లా సమాఖ్య అభ్యర్థనతో మండల మహిళా సమాఖ్యలకు అందిస్తే ఉప కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 34 ఆరోగ్య ఉప కేంద్రాల పక్కా భవనాల నిర్మాణ పనులు చేసేందుకు సమాఖ్యల మహిళలు ముందుకువచ్చారు. మహిళల ఉత్సాహాన్ని గుర్తించిన కలెక్టర్ శరత్కుమార్ డీఎంహెచ్ఓలో ఉన్న నిధులను సమాఖ్యలకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.20లక్షలను మంజూరు చేసి నిర్మాణ పనులు నాణ్యతగా ఉండేటట్లు అధికారుల పర్యవేక్షించనున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలకు రూ.6.80కోట్ల నిధులను మండల సమాఖ్యలకు కేటాయించి మహిళలతో భవన నిర్మాణాలు చేయించడం హర్షణీయం. మహిళా శక్తి గొప్పతనాన్ని గుర్తిస్తే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం, ప్రతి పని విజయవంతం అవుతుంది. అందుకే సీఎం కేసీఆర్ మహిళా సంఘాలకు రూ.20లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించడంతో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను నిలబెట్టుకునే స్థాయికి మహిళలు ఎదిగారు.
జిల్లాలో నిర్మించనున్న ఉప కేంద్రాలు
మెరుగైన వైద్య సేవల్లో జిల్లా ఇప్పటికే ఆదర్శంగా నిలిచింది. కొత్త ఆరోగ్య ఉప కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మిస్తే వైద్యరంగంలో రాష్ట్రం ముందంజలో ఉంటుంది. జిల్లాలోని తాలెల్మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కొత్తగా ఏడు ఉప కేంద్రాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. మునిపల్లి-6, రాయికోడ్-5, అందోల్-2, మిగతా మిర్జాపూర్, న్యాల్కల్, కంది, కల్హేర్, కంగ్టి, మొగుడంపల్లి ఉప కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున భవనాలు మంజూరు అయ్యాయి. జిల్లాలో నూతనంగా నిర్మాణం కానున్న ఆరోగ్య ఉప కేంద్రాలతో పేదలకు మెరుగైన వైద్యం మరింత చేరువకానున్నది.
తహసీల్దార్ల ఆధ్వర్యంలో స్థల సేకరణ
జిల్లాలో కొత్తగా చేపట్టనున్న ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు పంచాయతీ పరిధిలో స్థలాలను తహసీల్దార్లు, వైద్య అధికారి సహాయ, సహకారాలతో ఎంపిక చేస్తారు. మండల సమాఖ్యలు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వినియోగించుకొని నిర్మాణ పనులు చేపట్టాలి. తదుపరి మిగులు నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల సమాఖ్యలకు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లకు ఆదేశాలున్నాయి. మండల సమాఖ్యలలోని నిధులు ప్రతి నెలా వివిధ గ్రామ సంఘాల అభ్యర్థనతో రుణాలను మంజూరు చేస్తారు. మండల సమాఖ్యలో అధికంగా నిధులు నిల్వ లేకపోవడంతో ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణానికి డీఎంహెచ్ఓ నుంచి 60శాతం నిధులను మండల సమాఖ్యలకు కేటాయించాలని కలెక్టర్కు జిల్లా సమాఖ్య కోరినట్లు సమాచారం.
నేడు ఫసల్వాదిలో భూమిపూజ
సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉన్న కంది మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఫసల్వాది ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి నేడు టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ భూమిపూజ చేయనున్నారు. గ్రామంలో పక్కా భవన నిర్మాణానికి అడుగులు పడటంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అత్యధికంగా పుల్కల్ పీహెచ్సీ పరిధిలో 8 ఉప కేంద్రాలకు నూతన భవనాలు మంజూరు అయ్యాయి. ఒక్కో ఉప కేంద్ర భవన నిర్మాణానికి రూ.20లక్షలు నిధులు కేటాయించారు. వైద్య రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులతో ఇప్పటికే ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. దీంతో జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.