మెదక్ అర్బన్, ఏప్రిల్ 30: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ఓటువేస్తే రేషన్ కార్డులను రద్దు చేసి, ప్రజా సంక్షేమ పథకాలను ఆపేస్తారని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం కూచన్పల్లి, ముత్తాయికోట, మద్దుల్వాయిలో ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ భూములు, ఇల్లు, కారు ఉన్నాయనే నెపంతో రేషన్ కార్డుల రద్దుకు కుట్ర పన్నుతున్నారన్నా రు. నాలుగు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభు త్వం వృద్ధులకు రెండు నెలల పింఛన్ ఎగవేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల కోసం ఉంచిన రూ. 7000 కోట్లను కాంట్రాక్టర్లకు పంచిపెట్టి కమిషనర్ పేరిట ప్రభుత్వ పెద్దలు లబ్ధి పొందారని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి ఓటు వేస్తే రాబోయే కాలంలో ప్రజలు మరిన్ని కష్టాల పాలయ్యే అవకాశం ఉందన్నారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసం, రైతుల కోసం పాటుపడే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.100 కోట్లతో పేదల సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు సుభాష్రెడ్డి తెలిపారు. కారు గుర్తుకు ఓటువేసి మన బతుకులను మనమే బాగు చేసుకుందామని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ప్రచారంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు మాణిక్యరెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.