సిద్దిపేట, ఏప్రిల్ 3: అన్నివర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఎంపీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మెరుగు మహేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్రావు నివాసంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి ముదిరాజ్, నియోజకవర్గ అధ్యక్షుడు పయ్యావుల శ్యామ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు గరిపల్లి మహిపాల్గౌడ్, సమన్వయకర్త ఇరుగంటి రమేశ్, గాదగోని సాయి చరణ్గౌడ్, ప్రశాంత్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ బలోపేతమైతే, కాంగ్రెస్ పాలనలో భ్రష్టు పడుతున్నదన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి కేసీఆర్ నాణ్యమైన విద్యను అందించారన్నారు. సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సరిల్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పిందని తెలిపారు.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక మళ్లీ అవస్థలు ప్రారంభమయ్యాయని, రైతులు అన్నమో రామచంద్ర అని ఏడుస్తే, రైతుల పిల్లలు బతుకు భారమై, భవిష్యత్తు అంధకారమై, మళ్లీ కూలి పనుల బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల పాలనా అనుభవం కలిగిన మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీగా గెలిపించాలన్నారు. ఆయన రూ.100 కోట్ల పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు ప్రణాళిక బాగుందని, దీంతో వందలాది మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మండలానికో ఫంక్షన్హాల్ నిర్మించి రూపాయికే అద్దెకు ఇస్తామని ప్రకటించడం పేదలకు మేలు చేస్తుందన్నారు. సేవా గుణం ఉన్న మంచి మనిషి వెంకట్రామిరెడ్డిని రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దేశంలో అధికారంలో వచ్చే పరిస్థితి లేదని, బీజేపీకి ఓటేసి గెలిస్తే ఒరిగేదేమీ లేదన్నారు.