సంగారెడ్డి ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు ఓటమి భయంవెంటాడుతోంది. రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగలేదు. దీనికితోడు ఎన్నిక ల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు వార్డుల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని పార్టీశ్రేణుల సమావేశాల్లో చెప్పిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాటపక్కన పెట్టి కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలంటూ రెండురోజులుగా ప్రచారం చేస్తున్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉండటంతో విధిలేక ప్రచారంలోకి దిగకతప్పలేదు. సదాశివపేటలోని 25, 26వార్డుల్లో ప్రచారం చేసిన జగ్గారెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపిస్తే రూ.200 కోట్లతో మంజీరా నీటిపథకం తీసుకురావడంతోపాటు పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. జగ్గారెడ్డి భార్య, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, కూతరు జయారెడ్డి సైతం కాంగ్రెస్ అభ్యర్థుల తరపున రెండు మున్సిపాలిటీల్లో ప్రచారం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్నికలకోడ్ ఉల్లంఘిస్తున్నారు. గురువారం సదాశివపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన శంభులింగేశ్వరస్వామి ఆలయం వద్ద సోడా అమ్ముతున్న మహిళకు ఆయన లక్ష అందజేశారు. జగ్గారెడ్డి మహిళకు లక్ష ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.