నర్సాపూర్: ఉండటానికి ఇల్లు లేదు.. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) జాబితాలో తన పేరు లేదు అంటూ ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరేష్ తన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ, తాత పోషణలో పెరిగారు. తనకున్న పెంకుటిల్లు శిథిలావస్థకు చేరడంతో మూడు సంవత్సరాల క్రితం దానిని కూల్చేసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం తన నాన్నమ్మ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో కమిటీ సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, అధికారులు తప్పకుండా ఇల్లు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. తీరా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన నాన్నమ్మ పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త అయినప్పటికీ తనకు ఇల్లు రాకపోవడం సిగ్గుచేటుగా ఉందని బాధితుడు నరేష్ వాపోయారు. కాంగ్రెస్ కార్యకర్త అయిన తనకే ఇల్లు మంజూరు కాకపోతే పేద ప్రజల పరిస్థితి ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్లకు నచ్చిన వారికి అనుకూలంగా ఇండ్లను ఇప్పించారని ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీలో ఉన్న ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్న తర్వాత తన ఇల్లును కూలగొట్టుకోగా అతనికి ఇల్లు మంజూరు కావడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, కాంగ్రెస్ నాయకులు స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి న్యాయం చేయాలని కోరారు.