కొండపాక(కుకునూరుపల్లి), మే 6: ఐదు నెలల కాంగ్రెస్ పాలన రివర్స్గేర్లో నడుస్తు న్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం కొండపాక, కునూరుపల్లి మండలాల్లో నిర్వహించిన రోడ్డు షోలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుకునూరుపల్లిలో హరీశ్రావుకు బీఆర్ఎస్ శ్రేణులు క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు నెలకు రూ.2500, పెండ్లికి తులం బంగారం ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. కౌలు రైతుకు రూ. 15వేలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వండ్లకు రూ.500 బోనస్ ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతుల ఖాతాలో రైతుబంధు జమచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. కాంగ్రెస్ బోగస్ మాటలు నమ్మి ఓట్లు వేస్తే ప్రజలు మరోసారి తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోతే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా, సీఎంస్థాయిలో ఉన్న రేవంత్రెడ్డి భాష ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని, మన అభిమాన నాయకుడిని తిట్టిన వ్యక్తులకు ఓట్లతో సమాధానం ఇవ్వాలన్నారు.
కొంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదవులు అనుభవించి, గిప్పుడు కాంగ్రెస్లోకి ఏం ఉద్దరిస్తామని పోయారని, పార్టీలు మారిన దొంగలను గల్మలకు కూడా రానివ్వమని హెచ్చరించారు. బీజేపీకి ఓటేస్తే మన బతుకులు నీళ్లు లేని బాయిల అయిపోతయన్నారు. మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆశీర్వాదంతో ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెబుతున్నా ప్రతి పేదింటికి పెద్దన్నలా నిలబడతానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, టీఎస్ ఎంఐడీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్లోళ్ల శ్రీనివాస్, అనంతుల ప్రశాంత్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ అనంతుల అశ్వినీప్రశాంత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్యాదవ్, మాజీ ఎంపీపీ ర్యాగల సుగుణాదుర్గయ్య, వైస్ ఎంపీపీ దేవి రవీందర్, ఎన్ఆర్జీఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణారవీందర్, నాయకులు మల్లం ఐలయ్య, పెద్దంకుల శ్రీనివాస్, అమరేందర్, జైపాల్రెడ్డి, ఆకుల భద్రప్ప, బొద్దుల కనకయ్య, రాధాకిషన్రెడ్డి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.