గజ్వేల్, మే 21: సిద్దిపేట జిల్లా మర్కూక్లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్పై నిఘా కరువైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ మర్కూక్లో 15 టీఎంసీల సామర్ధ్యంతో కొండపోచమ్మ సాగర్ నిర్మించి, 2020 మేలో ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారు. ఈ రిజర్వాయర్ ద్వారా యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలోని రైతులకు సాగునీళ్లు అందుతున్నాయి.
ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును చూసేందుకు సెలవు రోజుల్లో పర్యాటకులు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. కానీ, ఇక్కడ భద్రత, రక్షణ చర్యలు గాలికి వదిలేయడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్కు దగ్గరలో ఉండడంతో సెలవు రోజుల్లో సందర్శకులు అధికంగా ప్రాజెక్టును చూసేందుకు వస్తున్నారు. ప్రత్యేకంగా ఆదివారం ఉదయం నుంచే సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉంటున్నది. ప్రాజెక్టును ప్రారంభించిన మొదట్లో ఇక్కడ పోలీస్ అవుట్పోస్టు కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పోలీస్ అవుట్పోస్టును ఎత్తేశారు. దీంతో రిజర్వాయర్ వద్ద రక్షణ చర్యలు కరువయ్యాయి.
ప్రారంభంలో ప్రాజెక్టుపైన 15.7 కిలోమీటర్ల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా సందర్శకుల రాకపోకలను గుర్తించేవారు. పర్యాటకులు అధికంగా వచ్చిన సమయంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టేవారు. నేడు ప్రాజెక్టుపై ఎక్కడా సీసీ కెమెరాల పనిచేయడం లేదు. పర్యవేక్షణ కరువైంది. దీంతో పర్యాటకులు ఇష్టానుసారంగా ప్రాజెక్టులోకి దిగుతున్నారు. భద్రత చర్యలు కరువై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది జనవరిలో హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు నీట ముగిని మృతిచెందారు.
కొండపోచమ్మ ప్రాజెక్టు లోతు తెలియక సందర్శకులు అందులోకి దిగి ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రాజెక్టు ముందు భాగంలో కట్ట ఎత్తు 40మీటర్లు ఉండగా, వెనుక భాగంలో కేవలం 12మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. వెనుక భాగంలో ఎత్తు తక్కువగా ఉండడంతో నీళ్లు తక్కువగా కన్పిస్తాయి. ఎత్తు తక్కువగా ఉన్న ప్రదేశంలో నేల కనిపించడంతో సందర్శకులు అక్కడి నుంచి నీటిలోకి దిగుతున్నారు. అక్కడ ఉన్న లోతు గుంతల్లో జారి పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ ప్రదేశంలో ఎంత నీరు నిల్వ ఉందో తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో సందర్శకులు తెలియకుండా అందులోకి దిగుతున్నారు.
కొండపోచమ్మ ప్రాజెక్టుపై భద్రత చర్యలు గాలికి వదిలేయడంతో తరుచూ ప్రమదాలు జరుగుతున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాజీవ్ రహదారికి దగ్గర్లోనే ఉండడంతో పర్యాటకులు ప్రాజెక్టుకు అధికంగా వస్తుంటారు. ప్రాజెక్టుపైకి వాహనాల అనుమతి నిషేధం ఉన్నప్పటికీ, పర్యాటకులు ప్రాజెక్టులోకి దిగడంతో సమస్య చోటుచేసుకుంటున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ, గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది. ప్రమాదాలు జరిగిన సమయంలో స్పందించే అధికారులు అక్కడ భద్రత చర్యలు మాత్రం చేపట్టలేకపోతున్నారు. ప్రధానంగా పాములపర్తి, మర్కూక్ గ్రామాల సమీప కట్ట నుంచి పర్యాటకులు ప్రాజెక్టుపైకి ఎక్కుతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్, పోలీస్ అధికారులు సంయుక్తంగా భద్రత చర్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.