చేర్యాల, మార్చి 23: కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లకు గోదావరి జలాలు రాలేదని, వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేల పరిహారం అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-3లో భాగంగా నిర్మించిన దేవన్నపేట పంపుహౌస్ నుంచి మోటరు ప్రారంభించి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేర్యాల ప్రాంత బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దేవాదుల ప్రాజెక్టు ఫేజ్-3ను ఆదివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదుల కథ రాస్తే రామాయణం, వింటే మహాభారం అంత ఉందని, తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో వచ్చి గోదావరి తీరనా శంకుస్థ్ధాపన చేసి వెళ్లిపోయాడన్నారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదులను పట్టించుకోలేదని, కేవలం 40వేల ఎకరాలే నీరు ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ దేవాదుల కోసం 5.14 లక్షల ఎకరాలకు నీరు అందేలా నిధులు కేటాయించారన్నారు. ఫేస్-1, ఫేస్- 2 పూర్తి చేసి ఫేస్-3లో భాగంగా రామప్ప దగ్గర దేవన్నపేట వరకు టన్నెల్ నిర్మాణం, దేవన్నపేట దగ్గర నుంచి ధర్మసాగర్ వరకు పంపులకు సంబంధించిన నిర్మాణ పనులను మొదలు పెట్టి రూ.1250 కోట్ల నిధులు కేటాయించినట్లు గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టన్నెల్ నిర్మాణం పూర్తిచేయించి, మోటర్లు తెప్పించి బిగించినట్లు తెలిపారు. కానీ, మోటర్లను ఆన్ చేయమంటే కాంగ్రెస్ సర్కారుకు అవగాహన లేదని, మోటర్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదని, పంపులు ఎక్కడ ఉన్నాయో, టన్నెల్ గురించి అసలే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మండలం తపాస్పల్లి, మద్దూరు మండలంలోని లద్నూర్తో పాటు బొమ్మకూరు, చీటకోడూరు, గండిరామారం రిజర్వాయర్లకు ధర్మసాగర్ నుంచి నీళ్లు రావాలన్నారు. ధర్మసాగర్కు చలివాగు నుంచి నీళ్లు రావాలని, చలివాగుకు బీంఘనపూర్ నుంచి రావాలని, బీంఘనపూర్కు గోదావరి తీరం నుంచి గోదావరి జలాలు వస్తాయన్నారు.
ఆనాడు గోదావరిలో ఇంటెక్ పాయింట్ సరిగ్గా లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం సమ్మక్క బ్యారేజ్ నిర్మించినట్లు తెలిపారు. ఎండాకాలంలో నీటికి సమస్య లేకుండా సమ్మక్క బ్యారేజ్ ఎంతో ఉపయోగపడుతున్నదని, ఇక్కడ కావాల్సిన నీరు, మోటర్లు, పంపులు ఉన్నాయన్నారు. కానీ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో 34 రోజులు మెగా కంపెనీకి చెందిన ఓఎన్ట్ స్టాఫ్ సమ్మె చేస్తే, సిగ్గులేని సర్కారు కనీసం రూ.6కోట్లు విడుదల చేయలేదని పట్టా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
రైతాంగానికి ఎంతో ఉపయోగపడే నీటికోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కమాట మాట్లాడలేదని, చివరికి తానే సంబంధిత ఏఈ, డీఈ, ఎస్ఈ, సీఈ, ఈఎన్సీ, ఇరిగేషన్ సెక్రటరీతో పాటు ఇరిగేషన్ మంత్రికి దృష్టికి తీసుకుపోతే రూ.6కోట్లు విడుదల చేస్తే 34 రోజుల సమ్మెను వారు విరమించుకున్నట్లు తెలిపారు. కానీ, ఆ సమ్మెతో రైతులతో రూ.600కోట నష్టం జరిగిందన్నారు. ముఖ్యంగా జనగామ, చేర్యాల ప్రాంతాల్లో 50 శాతం పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు నష్టపోయినట్లు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పంపులు ఆన్చేసి కొద్దోగొప్పో ఉన్న పంటలను కాపాడాలని ఆయన కోరారు.