రామాయంపేట, ఏప్రిల్ 3: నిత్యం ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం పట్టణ యువత విభాగం నూతన కమిటీ సమావేశానికి ఆమె హాజరై యువతకు దిశానిర్దేశం చేశారు.
ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలకు ఆశ చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మళ్లీ కేసీఆర్ సారే రావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బలం, బలగం యువతేనన్నారు. గడిచిన ఎన్నికల్లో దగ్గరి దాకా వచ్చి ఓటమి చెందామనే ఆందోళన చెందవద్దన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ యువ కౌన్సిలర్ చౌదరి చరిత, సుప్రభాతరావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీకోసం కష్టపడి పనిచేయాలన్నారు.
యువత పక్షాన రామాయంపేట నియోజకవర్గాన్ని సాధించి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకుంటామన్నారు. పద్మాదేవేందర్రెడ్డి సారథ్యంలోనే కృతనిశ్చయంతో పనిచేస్తామన్నారు. సమావేశంలో సీనియర్ నాయకుడు సుప్రభాతరావు, బసన్నపల్లి మల్లేశం, అస్నొద్దీన్, ఉమామహేశ్వర్, మధుకర్, యువత నాయకులు నవీన్ కుమార్, రాచూరి శ్రీనివాస్, దాకి బునిత్, సందీప్గౌడ్, కిరన్ సాగర్ పాల్గొన్నారు.