సంగారెడ్డి, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. పోలీసుల పహారాలో ఓవైపు ప్రైవేట్ ఉద్యోగులతో బస్సులు నడిపిస్తూ సమ్మె ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్న ది. కాంగ్రెస్ ప్రభుత్వ పన్నాగాలు పారటంలేదు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సక్సెస్ అయ్యింది.
కార్మికులంతా ఏకమై ఉదయం నుంచి బస్టాండ్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నా కార్మికులు వెనక్కి తగ్గడంలేదు. ఆర్టీసీ యాజమాన్యం పోలీసుల పహారా మధ్య బస్సులు నడిపిస్తుంది. శుక్రవారం 60కిపైగా బస్సులు నడిచాయి. జిల్లాలో చాలా చోట్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారు.
సంగారెడ్డిలో పోలీసులు కార్మికులపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కార్మికులు వేసుకున్న టెంట్ను పోలీసులు బలవంతంగా తొలిగించారు. పోలీసుల చర్యలను కార్మికులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం బస్టాండ్ ఎదుట నేలపై కూర్చుని ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పోలీసులు అక్కడి నుంచి కార్మికులు వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారు.

కార్మికులు వేసుకున్న జంఖానాలను(కార్పెట్) పోలీసులు తొలిగించి ఆటోలో తరలించేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు పోలీసుల చర్యలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తుంటే పోలీసులు తమపై జులుం ప్రదర్శిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. పోలీసుల జులుం నశించాలని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం , సీఐటీయూ మద్దతు ప్రకటించింది.ఆపార్టీ జిల్లా నాయకులు బి.మల్లేశ్ ఆర్టీసీ కార్మికులను కలిసి సంఘీభావం తెలిపారు. బీఎంఎస్ నాయకుడు ఈశ్వర్ప్రసాద్ సమ్మెలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
నారాయణఖేడ్ డిపో వద్ద పోలీసులు, కార్మికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డిపో నుంచి బస్సులు బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. బయటకు రాకుండా కార్మికులు బస్సుల ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి తొలగించి వేసే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్కు జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు నివాళుల ర్పించారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల్లో సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మౌన ప్రదర్శన చేపట్టారు.
సంగారెడ్డిలో జేఏసీ కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం శంకర్గౌడ్కు నివాళులర్పించారు. జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి శంకర్గౌడ్కు నివాళులర్పించారు. బీమ్ ఆర్మీ చీఫ్ సిద్దురావణ్ జహీరాబాద్లో కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. నారాయణఖేడ్ డిపోలోని కార్మికులు శంకర్గౌడ్కు నివాళులర్పించడంతోపాటు మౌన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు.