మెదక్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్డీవో శ్రీనివాస్తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 89 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించినవే. పింఛన్లు, మహిళా శిశు సంక్షేమం, జిల్లా పంచాయతీ అధికారి, అటవీ శాఖ, మున్సిపాలిటీ తదితర శాఖలకు సంబంధించి వచ్చిన వినతులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ, సకాలంలో పరిషరించి ప్రజావాణి వెబ్ సైట్లో అప్డేట్ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్లో సత్యసాయి సేవా సంస్థ, హవేళీఘనపూర్కు చెందిన రాజ రాజేశ్వరి బిన్ని మాడ్రన్ రైస్ మిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు వెంకట శైలేశ్, సాయిబాబా, విజయశేఖర్రెడ్డి, నాగరాజ్, ఆశాకుమారి, బ్రహ్మాజి, ఇందిరా, జెంలానాయక్, కమలాకర్, రాధాకిషన్, నర్సయ్య, శశిభూషణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో యూనూస్ తదితరలు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 17 : సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 32 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా అర్జీలను అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్వీకరించారు. అందులో 17 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవి, మిగతా శాఖలకు సంబంధించి 15 అర్జీలు ఉన్నాయి. అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కరించాలని పెట్టుకున్న అర్జీలను వెంటనే పరిశీలించాలన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, కలెక్టరేట్ ఏవో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి: మెదక్ ఎస్పీ
మెదక్ అర్బన్, ఏప్రిల్ 17: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.