మెదక్ రూరల్, డిసెంబర్ 15: దివ్యాంగులు ఆత్మవిశ్వా సంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళాశిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ధ్యాన్చంద్ విగ్రహం (బోధన్ చౌరస్తా) నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. దివ్యాంగుల ర్యాలీని జిల్లా అధికారి బ్రహ్మాజీ ప్రారంభించారు. అనంతరం స్టేడియంలో జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. దివ్యాంగులు వికలాంగత్వాన్ని జయించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. మహానీయులను స్ఫూర్తిగా తీసుకుని, పట్టుదలతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చూసుకోవాలని సూచించారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ దివ్యాంగులు సకలాం గులతో సమానమన్నారు. దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ప్రస్తావించిన విషయాలపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.
దేవుడు అపారమైన శక్తి ఇచ్చాడని, ఎవరేమనుకున్నా లక్ష్యసాధన దిశగా ఆత్మ స్తైర్యంతో ముందడుగు వేస్తే విజయం వరిస్తుందన్నారు. జిల్లాలో 12,796 మంది దివ్యాంగులు ఉన్నారని, వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాటరీ వీల్చైర్లు, చంకకర్రలు, వినికిడి యంత్రాలు, డైసీ ప్లేయర్, స్మార్ట్ఫోన్లు అందిస్తున్నామన్నారు. వివాహ ప్రోత్సాహకాలు, పింఛన్లు, బ్యాంకు రుణాలు, రాయితీ బస్సుపాసు సౌక్యరాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన పరుగుపందెం, షాట్ఫుట్, జావెలింగ్ త్రో, చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో మొదటి స్థానంలో 22, ద్వితీయ స్థానంలో 16, తృతీయ స్థానంలో 6 మంది నిలిచారు. వీరికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకటరమణమ్మ, ఈవోలు పద్మాలత, రవీందర్, ఐసీపీఎస్, ఎంఎస్కే, పీహెచ్ఎల్, సఖీ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.