మెదక్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 100 శాతం ఓటింగ్ నమోదుకు అధికార యంత్రాంగం కృషిచేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు అనుమతి లేదన్నారు. ఎపిక్ కార్డ్లు పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ప్రజలు ఉండాలన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రపంచంలో అన్ని దేశాలకంటే మనదేశంలో ఎకువ యువత ఉందని, నూత న ఓటర్లు దేశానికి, ప్రజాస్వామ్యానికి పునాది వంటి వారని పేర్కొన్నారు.
ఓటును నిర్లక్ష్యం చేయరాదని, యువత చైతన్యం కావాలని, రాజకీయ నిర్ణయాధికారం యువతదే అన్నారు. ఓటు అమ్ముకోవడం నేరమని, నూతన ఓటరు ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని గెలిపించాలని అన్నారు. కొత్త ఓటరు దేశానికి పునాది లాంటివారని పేర్కొన్నారు. యువత వారి తల్లితండ్రులకు ఓటు గురించి వివరించాలన్నారు. కుల, మత,వర్గ, వర్ణ, ప్రాంత, భాషలాంటి తారతమ్య భేదాలు లేకుండా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం ఏదైనా వస్తువుల పంపిణీ జరిగితే, ఏదైనా ఫిర్యాదులు ఉంటే సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ 1950 ఫోన్ లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఓటుహకు వినియోగించుకోవడానికి ఫొటోతో ఉన్న 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని పోలింగ్ స్టేషన్కి తీసుకురావాలని ఓటర్లకు కలెక్టర్ సూచించారు.